వంశీనా, విధేయతా... గన్నవరంలో జగన్ కు అగ్నిపరీక్ష- ఉప ఎన్నిక పేరుతో ఆధిపత్య పోరు..
గన్నవరం : ఏపీలో 151 సీట్ల ఏకపక్ష మెజారిటీతో పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వం ఉప ఎన్నికలకు వెళ్లబోతుందనే సంకేతాలు గన్నవరం రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి. పట్టణ వైసీపీ రాజకీయాల్లో కొత్త, పాత నేతల మధ్య గతంలో ఎన్నడూ లేనంతగా హోరాహోరీ పోరుకు తెరదీశాయి. ఇక్కడ ఎమ్మెల్యే వంశీ, దుట్టా రామచంద్రరావు వర్గాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం చూస్తుంటే త్వరలో ఉప ఎన్నికలు ఖాయంగా తెలుస్తోంది. ఇందులో అభ్యర్ధిగా ఎవరుండాలనే ప్రశ్న ఇప్పుడు వైసీపీని తీవ్రంగా కుదిపేస్తోంది. అయితే మంత్రుల మద్దతున్న వంశీ, వైఎస్ కుటుంబ విధేయుడైన దుట్టాను దాటి వెళ్లగలడా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న...
Recommended Video
ఏపీలో ఉప ఎన్నికలు ?
గతేడాది భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకున్న వైసీపీ ప్రభుత్వం తెలంగాణలో కేసీఆర్ తరహాలోనే విపక్షాలను క్లీన్ స్వీప్ చేసేయాలని నిర్ణయించుకుందా ? గన్నవరంతో పాటు విశాఖలో జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారం అందులో భాగమేనా ? విపక్ష పార్టీల నుంచి వైసీపీలోకి రావాలనుకునే వారు పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామాలు చేసి రావాలన్న సూచన మేరకు పార్టీ పదవి వదులుకున్న నేతలు.. ఇప్పుడు ఎమ్మెల్యే పదవులు కూడా వదులుకోబోతున్నారా ? తద్వారా ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైపోతున్నారా ? తాజాగా మారుతున్న రాజకీయ వాతావరణం చూస్తుంటే ఇదే నిజమని అనిపిస్తోంది. అయితే ఎమ్మెల్యే పదవులకు వీరు సమర్పించిన రాజీనామాలను ఆమోదించడం ద్వారా జగన్ ఎప్పుడు ఉప ఎన్నికలకు తెరదీస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మార్ంది.
కత్తి మీద సాములా ఉప ఎన్నికలు..
ఏపీలో టీడీపీ ఎమ్మెల్యేలు ఖాళీ చేసిన స్ధానాలతో పాటు భవిష్యత్తులో వైసీపీలోకి రావడం కోసం పదవులు వదులుకునే నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న స్ధానాలవ కూడా కలుపుకుని ఉప ఎన్నికలకు వెళ్లాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఉప ఎన్నికల హంగామా పలు చోట్ల కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు వైసీపీలో చిచ్చుకు కూడా కారణమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కోల్పోయిన స్ధానాల్లో పోటీ చేసిన నేతలు.. ఆయా చోట్ల నుంచి ఇప్పుడు పార్టీలోకి వస్తున్న నేతలతో హోరాహోరీకి సిద్ధమవుతున్నారు. పలుచోట్ల మరికొందరు సీనియర్లు కూడా ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి సిద్ధమవుతున్న ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేలకు సవాళ్లు విసురుతున్నారు. అయితే వీరి మధ్య విభేదాలను పరిష్కరించి ఏకతాటిపైకి తీసుకురావడం అంతిమంగా జగన్కు కత్తి మీద సాములా మారుతోంది.
వేడెక్కిన గన్నవరం రాజకీయాలు...
ఇదే కోవలో గన్నవరం నుంచి టీడీపీ టికెట్పై గెలిచి ఆ తర్వాత వైసీపీకి మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పుడు వైసీపీ సీనియర్, వైఎస్సార్ విధేయుడిగా పేరు తెచ్చుకున్న దుట్టా రామచంద్రరావుతో పోటీ పడుతున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లో దుట్టాకు అసలు సీటే దక్కలేదు. కానీ వైఎస్ కుటుంబంతో ఆయనకు ఇప్పటికీ మంచి సంబంధాలున్నాయి. గన్నవరంలో ఉప ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లబోతోందనే సంకేతాలతో ఆయన మరోసారి అప్రమత్తమయ్యారు. పార్టీ పుట్టినప్పటి నుంచీ జగన్తో ఉన్న తమను కాదని, టీడీపీ నుంచి వచ్చిన వంశీకి సీటెలా ఇస్తారంటూ ఆయన తాజాగా పోరు ప్రారంభించారు. దీంతో గన్నవరం రాజకీయాలు ఉప ఎన్నికల సంకేతాలు లేకుండానే ఒక్కసారిగా వేడెక్కాయి.
జగన్ కు అగ్నిపరీక్ష....
వ్యూహాత్మకంగా కీలకమైన గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ తరఫున గెలిచినా మంత్రుల అండతో వైసీపీలోకి వచ్చిన వంశీ ఇప్పుడు బలంగా కనిపిస్తున్నారు. పనిలో పనిగా తనతో పాటు వైసీపీ కండువా కప్పుకున్న నేతలను ఆదరిస్తున్నారు. ఇదే ఇప్పుడు ప్రత్యర్ధి దుట్టా వర్గానికి రుచించడం లేదు. వైసీపీ కార్యకర్తలను కాదని, తనతో పాటు టీడీపీ నుంచి వచ్చిన వారిని ఆదరిస్తే తాట తీస్తానంటూ దుట్టా తాజాగా వంశీకి హెచ్చరికలు జారీ చేశారు. అంతటితో ఆగకుండా వచ్చే ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిని తానేనని, గత ఎన్నికల్లో భార్య అనారోగ్యం కారణంగా తాను పోటీకి దూరంగా ఉన్నానని, వైఎస్ కుటుంబ విధేయుడినైన తనకే ఈసారి సీటు లభిస్తుందని ఆయన కార్యకర్తల సమావేశం పెట్టి మరీ ప్రకటించుకున్నారు. దీంతో తానూ రేసులో ముందున్నానని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు దుట్టాను కాదని వంశీకి జగన్ టికెట్ ఇస్తే వైఎస్ కుటుంబ విధేయులను కూడా జగన్ విస్మరించారన్న చెడ్డపేరు తప్పదు. అలాగని దుట్టాకు సీటిస్తే టీడీపీ నుంచి తెచ్చిపెట్టుకున్న వంశీకి అన్యాయం చేసినట్లవుతుంది. అసలు టీడీపీ నుంచి వచ్చిన వంశీని గెలిపించుకోవడం కోసమే ఉప ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నప్పుడు వంశీకి టికెట్ ఇవ్వకుండా ఉండలేని పరిస్ధితి. దీంతో జగన్ కు ఈసారి గన్నవరంలో అగ్నిపరీక్ష తప్పదనే వాదన వినిపిస్తోంది.