వంశీ అడుగులు అటు వైపే: వెంకటరావుకు దక్కిన హామీ: జగన్ వ్యూహం ఇదే..!
ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేయటం..వైసీపీలోకి వెళ్తారనే ప్రచారం తరువాత ఈ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. వల్లభనేని వంశీని చివరి నిమిషం వరకు అడ్డుకొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీలోనే ఉండమని సూచిస్తూ..మరో వైపు ఆయనతో చర్చల కోసం ఇద్దరు నేతలకు బాబు బాధ్యతలు అప్పగించారు. విజయవాడ కేంద్రంగా జిల్లా పార్టీ సమావేశం ఏర్పాటు చేసినా వంశీ హాజరు కాలేదు. చంద్రబాబు నియమించిన ఇద్దరు సభ్యులతోనే ఆయన మాట్లాడలేదు. అదే సమయంలో వంశీ ఎటువంటి తప్పు చేయలేదని..ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో వంశీ విషయంలో వైసీపీ సైతం ఆచితూచి అడుగులు వేస్తోంది. వంశీ వ్యవహారంలో ఎలా ముందుకెళ్లాలో.. ఏం చేయాలో.. ఎటువంటి వ్యూహం అమలు చేయాలనే అంశం పైన సీఎం జగన్ ఆలోచన స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది.
వంశీ ఏం నేరం చేశాడని..: నేను చెప్పిందే అనుసరిస్తున్నారు: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!
వైసీపీలోకి వంశీ ఎంట్రీ ఖాయమంటూ..
ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన సమయంలోనే వంశీ వైసీపీలోకి రావటం ఖాయమైపోయిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే, అధికారికంగా ఎప్పుడు చేరుతారనేది మాత్రం ఇంకా ముహూర్తం ఖరారు కాలేదని సమాచారం. ఇదే సమయంలో నియోజకవర్గంలో వంశీ ముఖ్య అనుచరులు మాత్రం కేడర్ ను సైతం టీడీపీ నుండి వైసీపీలోకి తీసుకొచ్చే విధంగా మంతనాలు సాగిస్తున్నారు. బాపులపాడు మండలంలో ని కొంత మంది మినహా మిగిలిన వారు వంశీతో పార్టీ మారటానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ చివరి నిమిషం వరకు వంశీ పార్టీ వీడకుండా ప్రయత్నాలు చేస్తూనే.. మరో వైపు వంశీ పార్టీ వీడటం ఖాయమనే అభిప్రాయంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. స్వయంగా టీడీపి అధినేత చంద్రబాబు నియమించిన ఇద్దరు నేతలతో సంప్రదింపుల కోసం కూడా వంశీ ముందుకు రాలేదు. దీని ద్వారా వంశీ ఇక టీడీపీలో ఉండే అవకాశాలు లేవనే అంచనాకు పార్టీ నేతలు వస్తున్నారు.
వెంకటరావుకు వైసీపీ హామీ...
గన్నవరం నియోజకవర్గంలో వంశీ చేరిక పైన ఆగ్రహంతో ఉన్న వైసీపీ నేత యార్లగడ్డ వెంకటరావు విషయంలో పార్టీ అధినేత ..ముఖ్యమంత్రి జగన్ నుండి వర్తమానం అందినట్లు సమాచారం. వంశీ వైసీపీలో చేరిక ముహూర్తం ఖరారైన తరువాతనే ఆయనతో జగన్ మాట్లాడే అవకాశం ఉంది. అయితే, జిల్లా వ్యవహారాలను ఎన్నికల సమయం నుండి పర్యవేక్షిస్తున్న సీనియర్ మంత్రి తాజాగా వెంకటరావుతో మాట్లాడినట్లుగా సమాచారం. వంశీ రాకపైన అభ్యంతరం వ్యక్తం చేయవద్దని.. చేరిక ముహూర్తం ఖరరైన వెంటనే ముఖ్యమంత్రి మాట్లాడుతారంటూ బుజ్జగించారు. అదే సమయంలో వంశీ వైసీపీలో చేరితే వెంకటరావుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వటానికి ముఖ్యమంత్రి సిద్దంగా ఉన్నారంటూ ఆ సీనియర్ మంత్రి పార్టీ అధినేత మాటగా చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో..వెంకటరావు సైతం జరుగుతున్న పరిణామాలను అధ్యయనం చేస్తూ..చివరి నిమిషం వరకు వేచి చూసే ధోరణితో ఉన్నట్లు కనిపిస్తోంది.
మరి కొంత కాలం ఇదే సస్సెన్స్..
వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేసినా..వెంటనే వైసీపీలో చేర్చుకోకూడదని ముఖ్యమంత్రి జగన్ ఆలోచనగా స్పష్టం అవుతోంది. అందులో భాగంగా అనధికారికంగా టీడీపీలోనే ఉంటూ వైసీపీతో టచ్ లో ఉండే విధంగా వంశీ వ్యవహరించనున్నారు. పార్టీ అధినేత వంశీ పైన క్రమశిక్షణా చర్యలు తీసుకోలేని పరిస్థితులు కల్పించే క్రమంలో భాగంగానే..ఇప్పుడు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో...వంశీ పార్టీ వదిలి వెళ్లే దాకా టీడీపీ ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో నియోకవర్గంలో వైసీపికి అనుకూలంగా తన అనుచర వర్గాన్ని సమీకరించే ప్రయత్నాలను వంశీ ముమ్మరం చేసారు. మరో వైపు వైసీపీలో వంశీ రాకను వ్యతిరేకించే వారిని బుజ్జగించే ప్రయత్నాలను వైసీపీ నేతలు ప్రారంభించారు. దీంతో..టీడీపీలో అనిశ్చితి కంటిన్యూ అయ్యేలా చేయటమే ముఖ్యమంత్రి జగన్ వ్యూహంగా స్పష్టం అవుతోంది.