కనపడని శత్రువుతో యుద్ధం చేయడం కష్టం: చంద్రబాబు లేఖకు వంశీ ఘాటైన లేఖ
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు వల్లభనేని వంశీ ఎమ్మెల్యే పదవికి, టిడిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన వ్యవహారం దుమారం గా మారింది. వల్లభనేని వంశీ మోహన్, చంద్రబాబుకు తన రాజీనామాకు గల కారణాలు వివరిస్తూ లేఖ రాశారు.ఇక చంద్రబాబు సమాధానంగా లేఖ రాశారు. వ్యక్తిగతంగా తను అండగా ఉంటానని, కేసులకు , వేధింపులకు భయపడకుండా పోరాటం చెయ్యాలని పేర్కొన్నారు. రాజీనామా ఆలోచనే విరమించుకోవాలని చంద్రబాబు వంశీ మోహన్ కు సూచించారు. ఇక వంశీ మోహన్ కు చంద్రబాబు నాయుడు రాసిన లేఖతో వంశీ స్పందించారు. వంశీ చంద్రబాబు లేఖ కు ప్రత్యుత్తరంగా మరోమారు తన స్పందన తెలియజేశారు.
చంద్రబాబు లేఖపై వంశీ స్పందన
ఇక ఆ లేఖలో వంశీమోహన్ తన లేఖ పై చంద్రబాబు స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకాలం తాను చంద్రబాబు అడుగు జాడల్లో నడిచానని, ప్రభుత్వ హింసను ఎదుర్కొన్నానని అన్నారు. ఇక అంతే కాదు తనకు కృష్ణాజిల్లాలో టీడీపీ శ్రేణుల నుండి కానీ, పార్టీ నుండి కానీ మద్దతు లభించకపోయినా, రాజ్యాంగ బద్ధమైన సంస్థల సాయంతో పోరాటం సాగించానని పేర్కొన్నారు. అన్యాయాలను ఎదుర్కోవడానికి అలుపెరుగని పోరాటం చేశానన్నారు.
కనపడని శత్రువుతో యుద్ధం చేయటం కష్టమన్న వంశీ
ఎన్నికల ముందు నుండి జరిగిన రాజకీయ పరిణామాలు అన్ని చంద్రబాబుకు తెలుసు అని పేర్కొంటూ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయ వద్దని తనపై ఒత్తిడి వచ్చిందన్న విషయాన్ని ప్రస్తావించారు. కనబడని శత్రువుతో యుద్ధం చేయడం కష్టమని వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు ఎన్నికల్లో పోటీ చేసిన పలు సందర్భాలను గుర్తుచేస్తూ పార్టీలోనూ తాను ఇబ్బంది పడ్డ పరిస్థితులను వివరించారు. గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉన్నప్పటికీ, విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశానని గుర్తు చేశారు వంశీ.
తన వారిని ఇబ్బందుల పాలు చెయ్యటం ఇష్టం లేకే నిర్ణయం అన్న వంశీ
నగర టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో, కాంగ్రెస్ పార్టీ అరాచకాలపై పోరాటం సాగించానని వల్లభనేని వంశీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్నికల తర్వాత కూడా తాను ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని, రాజకీయంగా వేధింపులకు గురవుతున్నానని వంశీ తన లేఖలో మరోమారు పేర్కొన్నారు. తనపై, తన అనుచరులపై కేసులు బనాయిస్తున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన వారిని ఇబ్బందుల పాలు చేయడం ఇష్టం లేకనే తాను రాజకీయాల నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నానని వల్లభనేని వంశీ పేర్కొన్నారు.
ఇంతకీ వంశీ ప్రస్తావించిన కనపడని శత్రువు ఎవరు ?
ఒకపక్క వైసిపి నేతల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని,ప్రభుత్వ వేధింపులకు గురవుతున్నానని లేఖ ద్వారా బాహాటంగానే చెప్పిన వల్లభనేని వంశీ కనపడని శత్రువుతో యుద్ధం చేయడం కష్టమని చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇంతకీ వల్లభనేని వంశీ యుద్ధం చేస్తున్న కనపడని శత్రువు ఎవరు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబుకు రాసిన లేఖలో వంశీ ప్రస్తావించారు అంటే ఆ శత్రువు ఎవరో చంద్రబాబుకు సైతం తెలుసా అన్న అనుమానం సైతం వ్యక్తమవుతోంది.