జగన్ బాత్రూంకు 48 లక్షల ఖర్చా?: పేర్ని నానికి వర్ల కౌంటర్
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి పేర్ని నానిపై వర్ల రామయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు రూ. 10 కోట్లు ఖర్చు చేశారంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. జగన్ కేబినెట్ మంత్రులు అబద్ధాలే మాట్లాడుతున్నారని అన్నారు.
రూ. 10కోట్లు కాదు..
చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చేసిన దీక్షకు కేవలం 1.60కోట్లు మాత్రమే ఖర్చయ్యాయయని వర్ల రామయ్య తెలిపారు. ఈ అంశాన్ని నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. చంద్రబాబు దీక్షకు రూ. 10 కోట్లు ఖర్చు చేసినట్లు నిరూపించగలరా? అని మంత్రి పేర్ని నానికి సవాల్ విసిరారు.
రూపాయికేనంటూ..
ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబుపై బురదజల్లాలనే ప్రయత్నం చేస్తున్నారంటూ వర్ల రామయ్య మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కేవలం రూపాయికే పని చేస్తున్నానని చెబుతుతారని.. కానీ తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీసుకు రూ. 15 కోట్లు ఖర్చు చేశారని వర్ల రామయ్య ఆరోపించారు.
బాత్రూంకు 48 లక్షలా?
కేవలం బాత్రూంలకే రూ. 48లక్షలు ఖర్చు చేశారన్నారు. పేరుకే రూపాయి జీతం అంటారని, రూ. 15 కోట్లు ఇంటికి ఖర్చు చేశారని ఆరోపించారు. ఆయన ఉండేది ప్రభుత్వం కూడా కాదని.. సొంత భవనానికి అన్ని నిధులు ఎందుకు ఖర్చు చేశారని వర్ల రామయ్య ప్రశ్నించారు. ఆ భవనాన్ని మళ్లీ అధికారంలోకి వచ్చే ముఖ్యమంత్రికి ఏమైనా అప్పగిస్తారా? అని అడిగారు. సొంత భవనానికి ప్రజా ధనం ఎలా ఖర్చు చేస్తారని నిలదీశారు.
సొంత కేసులకు ప్రజాధనమా?
సొంత కేసుల్లో జగన్ కోర్టుకు హాజరయ్యేందుకు రూ. 60లక్షలు ఎలా ఖర్చు చేస్తారని వర్ల రామయ్య ప్రశ్నించారు. నైతిక విలువలుంటే జగన్ ఆ ఖర్చులను సొంతంగా భరించుకోవాలన్నారు. మరో టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. హైకోర్టు వద్ద లాయర్లకు కనీసం కప్పు టీ కూడా దొరకడం లేదంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. త్వరలో ఇసుక తుఫాన్ రాబోతోందని, దీనిని తట్టుకునేందుకు ప్రభుత్వం నిలబడలేదని మండిపడ్డారు.