జగన్ సామాజిక లెక్కలు: పదవుల పంపకంలో ఛాన్స్ కొట్టేసిన వాసిరెడ్డి పద్మ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల పండగ జరుగుతోంది. ఇప్పటికే పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన ఏపీ సీఎం జగన్ తాజాగా మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా వైసీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇదిలా ఉంటే ప్రభుత్వం మారిపోవడంతో అప్పటి వరకు మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా ఉన్న నన్నపనేని రాజకుమారి బుధవారం ఆ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కు అందజేశారు. నన్నపనేని రాజీనామాను ఆయన ఆమోదించారు.
అప్పట్లో చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యంలో వాసిరెడ్డి పద్మ కీలక పాత్ర పోషించారు. అనంతరం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో వాసిరెడ్డి పద్మ వైసీపీ పార్టీలో చేరి పార్టీకి మంచి వాయిస్ను అందించారు. పార్టీ పరంగా ఏ సమస్య వచ్చినా ప్రత్యర్థులకు బుల్లెట్ లాంటి సమాధానంతో ఇరుకున పెట్టేవారు. ఇక సీఎం జగన్ సోదరి షర్మిలా చేపట్టిన పాదయాత్రలో తొలి రోజునుంచి చివరిరోజు వరకు ఆమె వెంటే నడిచారు. కృష్ణా జిల్లాకు చెందిన వాసిరెడ్డి పద్మ పలు టీవీ డిబేట్లలో తరుచూ పాల్గొంటూ వైసీపీ గొంతుకను వినిపించారు.
తాజాగా సీఎం జగన్ వాసిరెడ్డి పద్మను ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. వెంటనే ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా వాసిరెడ్డి పద్మ ఐదేళ్ల పాటు ఉంటారు. అయితే ఇప్పటికే తన కేబినెట్లో పాముల పుష్పశ్రీవాణికి డిప్యూటీ సీఎం, హోంమంత్రిత్వ శాఖ సుచరితకు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ తానేటి వనితకు చోటు కల్పించి మహిళలకు పెద్ద పీట వేశారు. అంతేకాదు నగరి ఎమ్మెల్యే రోజాకు ఏపీఐఐసీ ఛైర్పర్సన్గా నియమించారు. తాజాగా వాసిరెడ్డి పద్మను మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా నియమించడంతో కీలకమైన నామినేటెడ్ పోస్టులు మహిళలకు ఇచ్చినట్లయ్యింది.