రేపే ఫలితాలు: 2019కి బీజేపీ కంటే కాంగ్రెస్కు కీలకం, చంద్రబాబు ప్రయత్నాలకు మోడీ బ్రేక్ ఇచ్చేనా!?
న్యూఢిల్లీ: దాదాపు గత ఏడాది కాలంగా ఏ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరిగినా వాటిని 2019 లోకసభ ఎన్నికలకు ప్రీ ఫైనల్స్గా భావిస్తున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలకు దాదాపు నాలుగైదు నెలల ముందు జరిగిన ప్రస్తుత ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరాం ఎన్నికల ఫలితాలను కూడా వచ్చే లోకసభ ఎన్నికలకు కీలకంగా భావిస్తున్నారు.
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో బీజేపీ వరుసగా మూడు సార్లు అధికారంలో ఉంది. సాధారణంగా ఒక్కసారి అధికారంలో ఉంటేనే ప్రజా వ్యతిరేకత కనిపిస్తుంది. అలాంటిది ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీ మూడు పర్యాయాలు ఉండి, తిరిగి ఇప్పుడు అధికారం చేజిక్కించుకుంటే అది వారి ఘనతగానే చెప్పుకోవచ్చు. రాజస్థాన్లో ఓటర్లు ప్రతిసారి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. తెలంగాణలో తెరాస, కాంగ్రెస్ మధ్య పోటీ. కాబట్టి ఓ విధంగా లోకసభ ఎన్నికలకు ముందు బీజేపీకి ఈ ఎన్నికలు అత్యంత కీలకమని చెప్పలేని పరిస్థితి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఎంతో కీలకం. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ గెలవకుంటే మోడీ హవాకు తిరుగులేనట్లేనని చెప్పవచ్చు.
బీజేపీ హవా
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది. గత ఏడాది డిసెంబర్ నెలలో గుజరాత్ ఎన్నికల తర్వాత 13 లోకసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా బీజేపీ, దాని మిత్రపక్షాలు మూడు స్థానాల్లోనే గెలిచాయి. అలాగే 22 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా కేవలం 5 సీట్లు గెలుచుకుంది. మూడు దశాబ్దాల తర్వాత 2014లో బీజేపీ లోకసభ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ దక్కించుకుంది. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లోను బీజేపీ వరుసగా గెలుచుకుంటూ వచ్చింది. ఇది బీజేపీ లేదా మోడీ హవాకు నిదర్శనం.
తెలంగాణ ఎన్నికలపై పురంధేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు, కేసీఆర్కు షరతు! చంద్రబాబుపై ఆగ్రహం
టెంపుల్ రన్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ క్లిష్టంగా నెగ్గింది. ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగగా.. మూడు రాష్ట్రాలు బీజేపీ అధికారంలో ఉన్నవి. ఇందులో రెండు రాష్ట్రాల్లో వరుసగా నాలుగోసారి వస్తే కనుక అది అద్భుతమే అవుతుంది. ప్రతిసారి ఓ పార్టీని ఎన్నుకునే రాజస్థాన్లో ఎప్పటిలాగే ఈసారి బీజేపీ పోయి కాంగ్రెస్ వస్తుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని విమర్శించేందుకు బీజేపీ నిత్యం వారసత్వ రాజకీయాలను తెరపైకి తెస్తోంది. అలాగే బీజేపీకి అండగా ఉన్న హిందుత్వ ఓట్లను కొల్లగొట్టేందుకు రాహుల్ గాంధీ టెంపుల్ రన్ ప్రారంభించారు.
కాంగ్రెస్కు చాలా ఈజీ కావాలి కానీ
నోట్ల రద్దు, జీఎస్టీలు భావి భారతానికి ఎంతో ఉపయుక్తం. కానీ దీనిపై తాత్కాలికంగా ప్రజలు కొంత అసంతృప్తితో ఉన్నారు. దీనికి తోడు మధ్యప్రదేశ్లో రైతుల సమస్యలు బీజేపీని ఇరకాటంలో పడేశాయి. పైగా వరుసగా మూడుసార్లు బీజేపీయే అధికారంలో ఉంది. ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీ చాలా సులభంగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లను కైవసం చేసుకోవాలి. కానీ ఎగ్జిట్ ఫలితాలు చూస్తే అలా లేవు. అంటే శివరాజ్ సింగ్, రమణ్ సింగ్, మోడీ ప్రభుత్వాలపై ఆయా రాష్ట్రాల ప్రజలు ఇంకా నమ్మకంతో ఉన్నారని భావించవలసి ఉంటుందని అంటున్నారు.
బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీకి కీలకం
బీజేపీయేతర పార్టీలు ఏకమవుతున్న ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎంతో కీలకలం. కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు నెగిటివ్గా ఉంటే బీజేపీయేతర పార్టీల ఏకం అంటూ కాంగ్రెస్ దగ్గరకు వస్తున్న ప్రాంతీయ పార్టీలు మెల్లిగా దూరమయ్యే అవకాశాలను కొట్టి పారేయలేము. కాబట్టి బీజేపీ కంటే ఈ ఫలితాలు కాంగ్రెస్కు ఎంతో కీలకంగా మారుతున్నాయి.
చంద్రబాబు ప్రయత్నాలకు దెబ్బపడేనా?
ఇప్పటికే ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బీజేపీయేతర పార్టీల ఏకం అంటూ దేశవ్యాప్తంగా పలువురి వద్దకు వెళ్తున్నారు. సోమవారం కూడా నేతలు భేటీ అవుతున్నారు. మంగళవారం నాటి ఫలితాలు వ్యతిరేకంగా ఉంటే కాంగ్రెస్ సహా విపక్షాలను ఏకం చేయాలన్న చంద్రబాబు ప్రయత్నాలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కొట్టి పారాయలేమని చెబుతున్నారు.