‘40 ఇయర్స్ ఇండస్ట్రీకి ఏమైంది? చంద్రబాబు చేసిన పనికి జాతీయ మీడియాలో పెద్ద చర్చ’
అమరావతి: టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ ఇళ్లు, కార్యాలయాల్లో జరిగిన ఐటీ దాడులపై స్పందిస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చిన్న రాష్ట్రం సీఎంగానే దేశం మొత్తం ఎన్నికల ఫండిచ్చాడు..
‘కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్కు పంపిన 400 కోట్లే కాదు. బిజెపి వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నిటికీ నిధులు సమకూర్చాడు. తెలంగాణా ఎన్నికల్లో 400 కోట్లు ఖర్చుపెట్టాడు. అప్పట్లో దీనిపై జాతీయ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. 13 జిల్లాల చిన్న రాష్ట్రం సిఎం దేశం మొత్తానికి ఎలక్షన్ ఫండింగ్ చేశాడు' అని విజయసాయి రెడ్డి ఆరోపించారు.
70వేల కోట్ల అప్పు మిగిల్చి..
‘కమీషన్ల కోసం ఎక్కువ ధరకు విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు చేసుకొని ఏపీ ట్రాన్స్ కోకు 70 వేల కోట్లు అప్పులు మిగిల్చి వెళ్లాడు బాబు. ఈ పిపిఏల దళారి ఎవరంటే కిరసనాయిలు. అక్రమ సంపాదన ఆగిపోయిందనే సిఎం జగన్ గారిని పిపిఏల రద్దుపై ప్రధాని మోదీ నిలదీశారని బోగస్ వార్త రాశాడు' అని విజయసాయి మండిపడ్డారు.
ఏమైంది 40 ఇయర్స్ ఇండస్ట్రీకి?
‘మద్యం ధరలు పెంచి మందు బాబుల పొట్ట కొడుతున్నారని రంకెలేస్తాడు. పీపీఏలను సమీక్షించి తక్కువ ధరకు కరెంట్ కొనుగోలు చేద్దామని ప్రభుత్వమనుకుంటే అడ్డుపడతాడు. ఇన్ సైడర్ ట్రేడింగు పైనా దర్యాప్తు జరపొద్దట. తన మాజీ పిఎస్ అడ్డంగా దొరికితే కక్ష సాధింపు అంటాడు. ఏమైంది 40 ఇయర్స్ ఇండస్ట్రీకి?' అని విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు.
ఇంత బాధ్యత లేకుండానా?
‘మద్యం వ్యసనం నుంచి బయటపడుతున్నవారిని రెచ్చగొట్టి మళ్లీ బానిసలను చేసిందాకా చంద్రబాబు నిద్రపోయేట్టు లేడు. ఇప్పుడిపుడే తాగుడుకు దూరమై భార్యాపిల్లలతో ప్రశాంతంగా గడుపుతున్నారు. 14 ఏళ్లు సిఎంగా చేసిన వ్యక్తి ఇంత బాధ్యత లేకుండా మాట్లాడటం దేశంలో ఎక్కడా కనిపించదు' అని చంద్రబాబుపై విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు.
Recommended Video
చిట్టీ అంటూ లోకేష్పై...
‘తండ్రేమో తన ఆస్థి లక్ష కోట్లని వేల మంది సాక్షిగా ప్రకటించాడు. చిట్టినాయుడేమో ఆస్థుల వివరాలంటూ, ఎండాకాలంలో లేచే సుడిగాలిలా అందరి కళ్లలో దుమ్ముకొడతాడు. ఈ ఐదేళ్లలో ఎంత నొక్కేసిందీ త్వరలోనే బయట పడుతుంది. అప్పుటిదాకా ఆ కాయితాలు భద్రంగా దాచుకో చిట్టీ!' అంటూ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.