39వ డివిజన్ అభ్యర్థి ఖరారు.. పంతం నెగ్గించుకున్న కేశినేని నాని
విజయవాడ 39వ డివిజన్ అభ్యర్థిని ఎట్టకేలకు టీడీపీ ఖరారు చేసింది. అభ్యర్థిపై ఎంపీ కేశినేని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్ మీరా మధ్య యుద్ధమే జరిగింది. విషయం అధినేత చంద్రబాబు నాయుడు వరకు వెళ్లింది. సమస్యను పరిష్కరించేందుకు అచ్చెనాయుడుని రంగంలోకి దింపాల్సి వచ్చింది. స్వయంగా చంద్రబాబు నాయుడుతో మాట్లాడిచండంతో గొడవ సద్దుమణిగింది.
విజయవాడలో వివాదం నెలకొన్న 39వ డివిజన్ టీడీపీ అభ్యర్థిగా శివశర్మ పేరును టీడీపీ ఖరారు చేసింది. ఇదే 39వ డివిజన్ నుంచి మాజీ కార్పొరేటర్ గుండారపు హరిబాబు కుమార్తె గుండారపు పూజిత కూడా టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. పార్టీని నమ్ముకుని ఉన్న తమను కాదని వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వ్యక్తికి కార్పొరేటర్ టికెట్ ఇవ్వడమే కాకుండా, కార్యాలయ ప్రారంభోత్సవానికి రావడం కేశినాని రావడం బుద్దా వెంకన్న వర్గీయుల్లో ఆగ్రహం నింపింది.
కేశినేని నానీని గుండారపు హరిబాబు, ఆయన కుతూరు పూజిత తదితరులు అడ్డుకుని నిలదీశారు. బీసీలకు అన్యాయం చేయడం ఎంత వరకు సబబమని ప్రశ్నించారు. పార్టీనే నమ్ముకుని ఎంతో కాలంగా పనిచేస్తున్నామని, తమకు అన్యాయం చేయవద్దని కోరారు. నిరసనల నడుమే ప్రారంభోత్సవాన్ని ముగించుకుని అక్కడినుంచి కేశినేని నాని వెనుదిరిగారు. అప్పటి నుంచి 39వ డివిజన్ అభ్యర్థిత్వంపై టీడీపీలో వివాదం నెలకొంది.
శివశర్మ అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ఖరారు చేసిందని, బుద్దా వెంకన్న, నాగుల్ మీరాకు అచ్చెన్నాయుడు చెప్పారు. ఆ తర్వాత వారిని చంద్రబాబుతో మాట్లాడించారు. చంద్రబాబు ఫోన్లో సర్దిచెప్పడంతో వారి మిన్నకుండిపోయారు. కలిసి పనిచేస్తామని.. చెప్పినట్టు తెలుస్తోంది.