విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ వద్ద అపశృతి- పెచ్చులూడి పడి కానిస్టేబుల్కు గాయాలు..
విజయవాడలో తాజాగా పలుమార్లు వాయిదాల తర్వాత ప్రారంభించిన ప్రతిష్టాత్మక కనకదుర్గ ఫ్లైఓవర్ వద్ద ఇవాళ అపశృతి చోటు చేసుకుంది. ఫ్లైఓవర్ పిల్లర్ కింద నిలబడిన పోలీసు కానిస్టేబుల్పై పెచ్చులు ఊడి పడటంతో అతని తల, భుజానికి గాయాలయ్యాయి. వెంటన్ స్పందించిన స్ధానికులు అతనికి ప్రాధమిక చికిత్స చేయించి ఆస్పత్రికి పంపారు.
కనకదుర్గ ఆలయం సమీపంలోని అశోక పిల్లర్ సమీపంలో నవరాత్రుల విధుల్లో భాగంగా ఏపీఎస్పీ బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్ రాంబాబు విధులు నిర్వర్తిస్తున్నారు. బందోబస్తు విధుల్లో భాగంగా ఫ్లైఓవర్ కింద నిలబడిన రాంబాబుపై పై నుంచి పెచ్చులు ఊడి పడ్డాయి. దీంతో అతని తలతో పాటు భుజాలకు గాయాలయ్యాయి. స్పందించిన స్ధానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్ధానికంగా ఫ్లైఓవర్ కింద ఉన్న మిగతా వారు కూడా అప్రమత్తమయ్యారు.
ఇన్నాళ్లూ ఫ్లైఓవర్ కట్టింది మేమంటే మేమని గొప్పలు చెప్పుకున్న రాజకీయ పార్టీల నేతలు ఒక్కరూ ఈ ఘటనపై స్పందించలేదు. సరికదా కానిస్టేబుల్ను సైతం పరామర్శించలేదు. ఫ్లైఓవర్ ప్రారంభించిన రెండు రోజుల్లోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంపై స్ధానికుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఫినిషింగ్ పనులు పూర్తికాకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. తగినంత సమయం దొరికినా అధికారులు ఈ పనులు పూర్తి చేయకుండానే ఫ్లైఓవర్ ప్రారంభించడం విమర్శలకు తావిచ్చింది.