కాకరేపుతున్న బెజవాడ పోరు- కీలకంగా రాజధాని తరలింపు- గెలుపు అంచనాలివే..
ఏపీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోరులో వైసీపీ వర్సెస్ టీడీపీ వార్ ముదురుతోంది. ఇప్పటికే మూడు రాజధానులతో పాటు పలు అంశాలను అజెండాగా చేసుకుని ఇరుపార్టీలు మాటలయుద్ధం కొనసాగిస్తున్నాయి. కీలకమైన విజయవాడ కార్పోరేషన్లో ఈసారి ఎవరికి పరిస్ధితులు అనుకూలంగా ఉన్నాయి ? ఎవరు వెనుకబడ్డారు ? దీనికి ప్రధానమైన కారణాలేంటన్న అంశంపై తాజాగా కొన్ని అంచనాలు వెలువడుతున్నాయి. వీటిని పరిశీలిస్తే మూడు రాజధానుల వ్యవహారం ఈసారి విజయవాడ కార్పోరేషన్ పోరుపై తీవ్ర ప్రభావాన్ని చూపబోతున్నట్లు తెలుస్తోంది.
విజయవాడలో వైసీపీ, టీడీపీ హోరాహోరీ
విజయవాడ కార్పోరేషన్లోని 65 డివిజన్లకు వచ్చే నెల 10వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో సిటీ పరిధిలోకి వచ్చే మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దాదాపు 20 డివిజన్ల చొప్పున ఉన్నాయి. ఇందులో ఓ చోట టీడీపీ ఎమ్మెల్యే, మరో రెండు టోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. తూర్పు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సెంట్రల్లో వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పశ్చిమలో వైసీపీ తరఫున మంత్రి వెల్లంపల్లి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగిన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ తహతహలాడుతుండగా.. దాన్ని బ్రేక్ చేసేందుకు టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. దీంతో ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.
విజయవాడ సెంట్రల్, తూర్పులో టీడీపీ హవా
ప్రస్తుతం విజయవాడ కార్పోరేషన్ పోరులో మొత్తం 65 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో సెంట్రల్, తూర్పు నియోజవర్గాల పరిధిలోనే 45 డివిజన్లు ఉన్నాయి. వీటిలో ఏ పార్టీ అత్యధిక స్ధానాలు కైవసం చేసుకుంటే వారికే మేయర్ పీఠం దక్కడం ఖాయం. అయితే ప్రస్తుతం తూర్పు, సెంట్రల్ నియోజకవర్గాల్లో వైసీపీ కంటే టీడీపీ అభ్యర్ధులు ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. కమ్మ సామాజిక వర్గం హవా ఎక్కువగా ఉండే తూర్పు నియోజకవర్గంలో టీడీపీ బలం ఏమాత్రం మారలేదని అర్ధమవుతోంది. అయితే సెంట్రల్లో గత అసెంబ్లీలో స్వల్ప మెజారిటీతో వైసీపీ బయటపడింది. అక్కడ మారిన సమీకరణాలు టీడీపీకి ఆధిక్యం కట్టబెడుతున్నట్లు తెలుస్తోంది.
విజయవాడ పశ్చిమ మాత్రమే వైసీపీకి ఊరట
విజయవాడలో తూర్పు, సెంట్రల్ నియోజకవర్గాలతో పోలిస్తే పశ్చిమ నియోజకవర్గం ఎప్పుడూ ప్రత్యేకమే. ఇక్కడ గెలిచే అభ్యర్ధులను చూసినా ఈ విషయం ఇట్టే అర్ధమవుతుంది. ముస్లిం, వ్యాపార వర్గాల జనాభా ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో వైసీపీ గత ఎన్నికల్లో ఆధిపత్యం చాటుకుంది. ఇప్పటికీ వైసీపీకి అక్కడి ముస్లిం, వ్యాపార వర్గాల్లో పట్టు ఏమాత్రం చెదరలేదని తాజా అంచనాలు చెప్తున్నాయి. అంతే కాదు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇక్కడ అంతా తానై నడిపిస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో వైసీపీ గెలుపు మంత్రి వెల్లంపల్లికి కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. పశ్చిమ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే 22 డివిజన్లలో వైసీపీకి కనీసం 10-15 డివిజన్ల వరకూ దక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నగరంలో ఇదొక్కటే వైసీపీకి ఊరటనిచ్చే అంశంగా కనిపిస్తోంది.
బెజవాడ కార్పోరేషన్ పోరులో మూడు రాజదానుల ఎఫెక్ట్
ప్రస్తుతం విజయవాడ కార్పోరేషన్కు జరుగుతున్న ఎన్నికల్లో వైసీపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడు రాజధానుల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. గతంలో టీడీపీ సర్కారు విజయవాడకు అమరావతి రూపంలో ఇచ్చిన రాజధానిని వైసీపీ విశాఖకు తరలిస్తోందన్న ప్రచారం విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల ప్రచారాస్త్రంగా మారిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే అమరావతి రాజధాని పోరులో ఇక్కడి వ్యాపార, వాణిజ్య, కార్మిక వర్గాలు పాల్గొంటున్నాయి. ఈ ఎన్నికల్లోనూ ఇదే అజెండాతో వారు ఓటేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. దీంతో వైసీపీకి ఇక్కడ మూడు రాజధానుల సెగ తగలడం ఖాయంగా కనిపిస్తోంది.