ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఏమయ్యాయ్?: విజయవాడ అగ్నిప్రమాదం మృతుల కుటుంబాలకు భారీ పరిహారం
విజయవాడ: విజయవాడ గవర్నరు పేటలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ కోవిడ్ ఆసుపత్రిలో చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం భారీ నష్ట పరిహారాన్ని ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని చెల్లిస్తామని వెల్లడించింది. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయవాడ నగరానికే చెందిన దేవాాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన కొద్దిసేపటికే ప్రభుత్వం ఎక్స్గ్రేషియాను ప్రకటించింది.
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం
సంఘటనా స్థలానికి చేరుకున్న వెల్లంపల్లి
స్వర్ణ ప్యాలెస్ హోటల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సమాచారం అందుకున్న వెంటనే మంత్రి వెల్లంపల్లి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, ఇతర అధికారులతో కలిసి ఆయన సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. స్వర్ణ ప్యాలెస్ హోటల్ను లీజుకు తీసుకుని అందులో కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేయడంలో లోపాలు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఆసుపత్రి యాజమాాన్యం నిర్లక్ష్యం
ఈ ఘటన చోటు చేసుకోవడానికి ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్య ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆసుపత్రులను నెలకొల్పడానికి అవసరమైన నిబంధనలను పాటించలేదని భావిస్తున్నారు. అత్యవసర ద్వారాలు ఉన్నాయా? లేవా? అనే అంశంపై దృష్టి సారించారు. అత్యవసర ద్వారాలు అందుబాటులో లేకపోవడం వల్లే అగ్నిప్రమాదం చోటు చేసుకున్న తరువాత బాధితులను రక్షించడానికి అగ్నిమాపక సిబ్బంది లోనికి వెళ్లడానికి లేదా.. మంటలు చెలరేగిన వెంటనే పేషెంట్లు బయటికి రావడానికి వీలు దొరకలేదని చెబుతున్నారు.
చట్టపరమైన చర్యలకు
స్వర్ణ ప్యాలెస్ హోటల్ కోవిడ్ సెంటర్ ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. దీనికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలను తీసుకోవడానికి సన్నాహాలు చేపట్టింది. దీనిపై విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రంగంలోకి దిగారు. పోలీసులు, అగ్నిపమాక సిబ్బంది, జిల్లా వైద్యాధికారులతో కలిసి ఓ నివేదికను రూపొందించే పనిలో ఉన్నారు. ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే పేషెంట్లు, వైద్య సిబ్బంది వెలుపలికి రావడానికి అవసరమైన అత్యవసర ద్వారాలు అందుబాటులో లేదా వినియోగంలో ఉన్నాయా? లేవా? అనే విషయంపై ఆరా తీస్తున్నారు.
Recommended Video
తొమ్మిదికి చేరిన మరణాలు
విజయవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోవిడ్ ఆసుపత్రిగా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్లో ఈ తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మొదట నలుగురు మరణించినట్లు నిర్ధారించారు. అనంతరం ఈ సంఖ్య ఏడుకు పెరిగింది. తాజాగా మరో ఇద్దరు మరణించారు. ఆ ఇద్దరు రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలను వదిలారు. దీనితో స్వర్ణ ప్యాలెస్ హోటల్ కోవిడ్ ఆసుపత్రిలో ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య తొమ్మిదికి చేరుకుంది.