అంతర్వేది తర్వాత మరో ఘటన- బెజవాడ దుర్గమ్మ వెండిరథంపై సింహాల మాయం- నేడు విచారణ
తూర్పుగోదావరి అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథం దగ్దం ఘటన మరువక ముందే ఇలాంటిదే మరో అపచారం విజయవాడ దుర్గమ్మ గుడిలో చోటు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అమ్మవారి రథంపై ఉండే నాలుగు సింహాల్లో మూడు మాయమైనట్లు తాజాగా కొందరు గుర్తించారు. దీంతో ఈ విషయం ఆ నోటా ఈ నోటా బయటికి పాకింది. అసలే అంతర్వేది వ్యవహారంతో రేగిన కలకలంతో తీవ్ర ఇబ్బందుల్లో పడ్డ రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణతో ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటోంది. ఈ నేపథ్యంలో వెండి సింహాల మాయం వ్యవహారం తేల్చేందుకు అధికారులు రంగంలోకి దిగారు.
మంత్రి కొడాలి నానిపై ఎదురుదాడి - విజయవాడ సీపీకి టీడీపీ నేతల ఫిర్యాదు-తొలిసారి నారా లోకేశ్ రియాక్షన్
దుర్గమ్మ రథంపై సింహాలు మాయం..
విజయవాడలోని దుర్గా మల్లేశ్వరస్వామి వెండి రథానికి ముందూ, వెనుక రెండేసి సింహాలు ఉంటాయి. వీటిలో మూడు సింహాలు అదృశ్యమయ్యాయన్న విషయం బయటికి రావడంతో ఆలయంలో నిన్న తీవ్ర కలకలం రేగింది. అంతర్వేది ఘటన తర్వాత పోలీసుల సూచన మేరకు దేవాలయ అధికారులు వెండి రథాన్ని పరిశీలించినప్పుడు ఈ విషయం బయటపడినట్లు తెలుస్తోంది. అయితే దీన్ని అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు. గతేడాది ఉగాది సందర్భంగా ఉత్సవ మూర్తులను రథంపై ఊరేగించారు. ఈ సారి కరోనా కారణంగా రథాన్ని బయటకు తీయలేదు. దానిపై ఇప్పటికీ ముసుగు వేసే ఉంచారు. తాజా తనిఖీల్లో వెండి సింహాలు కనిపించకపోవడంపై దేవాదాయశాఖ అధికారులు ఇరుకునపడ్డారు.
ఇవాళ పరిశీలించనున్న అధికారులు..
బెజవాడ దుర్గమ్మ రథంపై వెండి సింహాలు మాయమైన వ్యవహారం బయటికి పొక్కడంతో ఆలయ ఈవో సురేష్ బాబు స్పందించారు. ఈ వ్యవహారంపై తక్షణం విచారణ నిర్వహించి వాస్తవాలు నిగ్గుతేలుస్తామన్నారు. ఇవాళ విచారణ నిర్వహించేందుకు ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు వెండి సింహాలు ఎప్పుడు పెట్టారు, చివరి సారిగా రథాన్ని ఎప్పుడు వాడారు, ఆ తర్వాత ఎవరి నియంత్రణలో ఉంది, అసలు వెండి సింహాలు ఉన్నాయా, అదృశ్యమయ్యాయా, అయితే ఎలా అయ్యాయన్న అంశాలపై ఈవో సమక్షంలో విచారణ జరగనుంది. ఇందులో తేలే అంశాల ఆధారంగా తదుపరి చర్యలుంటాయని ఈవో సురేష్బాబు చెబుతున్నారు.
విచారణ తర్వాతే ఫిర్యాదు...
భక్తులు ఎంతో సెంటిమెంట్గా భావించే కనకదుర్గమ్మ గుడి నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం, ఆ తర్వాత వివాదాలు వాటంతట అవే సద్దుమణగడం కొంతకాలంగా జరుగుతూనే ఉంది. ఈసారి వెండిరథంపై వెండి సింహాల మాయం ఘటన నేపథ్యంలో అధికారులు ముందుగా విచారణ నిర్వహించనున్నారు. ఆ తర్వాత సింహాలు కనిపించకపోతే ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే మిగతా వెండి వస్తువుల పరిస్ధితిని కూడా తెలుసుకునే అవకాశముంది. వాస్తవానికి ఆలయంలో వెండి వస్తువులన్నింటికీ ఇన్సూరెన్స్ ఉంది. కానీ భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం సింహాల మాయం పుకార్లు ఆందోళన కలిగిస్తున్నాయి.