జగన్ కు 971 రూపాయలు ఇచ్చిన విజయవాడ బాలుడు- ఎందుకో తెలుసా ?
కరోనా వైరస్ పై పోరాటంలో ఇప్పటివరకూ లక్షలు, కోట్ల రూపాయలు దానం చేస్తున్న వారిని చూశాం. కరోనాపై పోరాడుతున్న ప్రభుత్వాలకు అండగా నిలిచేందుకు తోటి వారిపై మానవత్వంతో డబ్బుతో పాటు నిత్యావసర వస్తువులను కూడా దానం చేయడం చూస్తూనే ఉన్నాం. ఇదంతా తనను కదిలించిందో ఏమో కానీ విజయవాడకు చెందిన నాలుగేళ్ల బాలుడు తాను దాచుకున్న 971 రూపాయలను సీఎం జగన్ కు ఇవ్వాలని కోరుతూ మంత్రి పేర్నినానికి అందజేయడం ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది..
కరోనాపై పోరులో తాను సైతం..
ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా వైరస్ కేసులే కనిపిస్తున్నాయి. కేంద్రం సూచనల మేరకు లాక్ డౌన్ కూడా అమలవుతోంది. కరోనా మహమ్మారిపై పోరు కోసం కేంద్ర, రాష్ట్ర్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా సరిపోని పరిస్ధితి. దీంతో దాతలు తలో కొంత విరాళంగా ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. కానీ ఇవాళ విజయవాడకు చెందిన నాలుగేళ్ల బాలుడు హేమంత్ కరోనా పై పోరు కోసం తాను దాచుకున్న 971 రూపాయలను సీఎం జగన్ కు విరాళంగా పంపించాడు.
మంత్రి పేర్నినాని సాయంతో..
హేమంత్ తాను సైకిల్ కొనుక్కోవడానికి దాచుకున్న డబ్బులు 971 రూపాయలను జగన్ కు ఇవ్వాలని కోరడంతో తల్లితండ్రులు ఏపీ సమాచార, రవాణాశాఖ మంత్రి పేర్నినానిని ఆశ్రయించారు. తాడేపల్లిలోని వైస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి తల్లితండ్రులతో కలిసి వచ్చిన హేమంత్..మంత్రి పేర్ని నానికి ఆ మొత్తాన్ని అందజేశాడు. తనకి సీఎం జగన్ అంటే చాలా ఇష్టం అని అందుకే దాచుకున్న డబ్బులు ఇస్తున్నానని మంత్రికి హేమంత్ చెప్పాడు. కరోనా వైరస్ కోసం ఈ డబ్బులు జగన్ కు ఇవ్వాలని మంత్రికి హేమంత్ స్వయంగా చెప్పాడు. దీంతో ఆ మొత్తాన్ని సీఎం జగన్ కు అందజేస్తానని పేర్నినాని బాలుడికి హామీ ఇచ్చారు.
సైకిల్ కొనిస్తానన్న పేర్నినాని..
కరోనాపై పోరు కోసం చిన్నారి హేమంత్ విరాళం ఇచ్చేందుకు ముందుకు రావడం మంచి పరిణామమని చెప్పిన మంత్రి పేర్నినాని.. బాలుడు కోరుకున్న విధంగా సైకిల్ కొనిచ్చేందుకు సిద్ధమయ్యారు. బాలుడు కోరుకున్న సైకిల్ ను తానే కొనిస్తానని మంత్రి హేమంత్ తల్లితండ్రులకు హామీ ఇచ్చారు. దీంతో తల్లితండ్రులు కూడా సంతోషంలో మునిగిపోయారు. చిన్న వయస్సు లో ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్న హేమంత్ ని మంత్రి అభినందించారు.