విజయవాడ మేయర్ పీఠం టీడీపీదే, 50 సీట్లలో జయకేతనం, ఎంపీ కేశినేని నాని ధీమా
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల్లో టీడీపీ విజయంపై ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీదేనని ధీమాతో ఉన్నారు. విజయవాడ మేయర్ పీఠం టీడీపీదేనని ఎంపీ కేశినేని నాని విశ్వాసం వ్యక్తం చేశారు. వైసీపీ తొమ్మిది నెలల పాలనతో ప్రజలు విసిగిపోయారని ఆయన చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలతో మార్పు వస్తోందన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలో 21 మంది టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో పాటు కేశినేని అందజేశారు. ఈ సందర్భంగా కేశినేని నాని మీడియాతో మాట్లాడారు.
9 నెలల పాలనలో..
విజయవాడను కాపాడుకోవాలని శ్రేణులకు ఎంపీ కేశినేని నాని పిలుపునిచ్చారు. 9 నెలల పాలనతో రాష్ట్రం అధోపాతాళానికి తొక్కేశారని.. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న వాతావరణాన్ని వైసీపీ సర్కార్ ధ్వంసం చేసిందని దుయ్యబట్టారు. ఏపీని మరో బీహార్లా మార్చివేసిందని ఆరోపించారు.
ఢిల్లీ అంటే వెన్నులో వణుకు..
విజయవాడ-గుంటూరును ధ్వంసం చేసేందుకు జగన్ సర్కార్ కంకణం కట్టుకుందని ధ్వజమెత్తారు. తనపై ఉన్న కేసుల మాఫీ కోసమే.. బీజేపీ పెద్దలకు జగన్ అమ్ముడుపోయారని విమర్శించారు. విభజన హామీలపై ఎందుకు దృష్టిసారించడం లేదు అని ప్రశ్నించారు. విజయవాడలో 45 నుంచి 50 సీట్లు టీడీపీ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారని నాని విశ్వాసం వ్యక్తం చేశారు. మేయర్ పీఠాన్ని టీడీపీ అభ్యర్థి చేపట్టబోతున్నారని జోస్యం చెప్పారు.
పడకేసిన అభివృద్ధి..
చంద్రబాబు హయాంలో విజయవాడకు కొత్త సొబగులు వచ్చాయని, నగరం వేగంగా డెవలప్ అయ్యిందని స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటీ నుంచి.. విజయవాడ రూపురేఖలు మారిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి పడకేసిందని.. దీనిని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
21 మంది గెలుపుగుర్రాలే..
స్థానిక సంస్థల్లో సీపీఐతో పొత్తు పెట్టుకున్న విషయాన్ని గద్దె రామ్మోహన్ గుర్తుచేశారు. అందుకోసమే తూర్పు నియోజకవర్గ పరిధిలో గల 6వ డివిజన్ను సీపీఐకి కేటాయించినట్టు పేర్కొన్నారు. నియోజకవర్గంలో గల 21 డివిజన్లలో అభ్యర్థుల విజయం ఖాయమన్నారు. అభ్యర్థులను ఆచి తూచి ఎంపికచేశామని, గెలిచేవారిని ఎంపికచేశామని పేర్కొన్నారు.