Vijayawada ప్రజలు జాగ్రత్త.. మటన్ తింటే మటాషే.. రెచ్చిపోతున్న మాంసం మాఫియా..!
విజయవాడ: కొద్ది రోజుల క్రితం నెల్లూరులో పాలను కల్తీ చేసి మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వ్యక్తిని ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ అధికారులు అరెస్టు చేసిన కొద్ది రోజులకే విజయవాడలో అలాంటి మరో ఘటన వెలుగు చూసింది. అయితే ఇక్కడ చెడిపోయిన మాంసం, కుళ్లిపోయిన మాంసంను విక్రయించి ప్రజలను మోసం చేయడమే కాకుండా ఆరోగ్యంతో కూడా ఆటలాడుతున్న ముఠాను అధికారులు గుర్తించారు.
రెస్టారెంట్లలో కుళ్లిపోయిన మాంసం
ప్రజల ప్రాణాలంటే వ్యాపారమైపోయింది చాలామందికి. కాసుల కోసం కక్కుర్తి పడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా విజయవాడలో మరో దారణం వెలుగు చూసింది. కుళ్లి పోయిన మాంసంను తీసుకొచ్చి దాన్ని శుభ్రపరిచి రెస్టారెంట్లకు, హోటల్స్కు సరఫరా చేస్తోంది మాంసం మాఫియా. ఇందులో చనిపోయిన కోళ్లు, మేకలు, పొట్టేళ్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి ఆ కళేబరాలను శుభ్రపరిచి తిరిగి విక్రయిస్తున్నారు. ప్రతి ఆదివారం మాంసం అధికంగా అమ్ముడుపోతుంది. అందులో ఈ కుళ్లిపోయిన మాంసంను అధికంగా విక్రయిస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. వారానికి దాదాపుగా 4 టన్నుల కల్తీ మాంసంను ఈ మాఫియా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
నిబంధనలను ఉల్లంఘించి...
నిబంధనల ప్రకారం మటన్ విక్రయదారులు మేకలను, పొట్టేళ్లను వధించి వీఎంసీ స్టాంప్ వేసి విక్రయించాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలను మాంసపు వ్యాపారులు పాటించడం లేదు. ఏదో ఒక దానిపై నామమాత్రంగా వేసి మటన్ అమ్ముతున్నారు. ఇక అధికశాతం మాంసం డబ్బులకు కక్కుర్తి పడి కుళ్లిపోయిన మటన్ను చెడిపోయిన మటన్ను ప్రజలకు విక్రయిస్తున్నారు. ఇది తెలియని ప్రజలు అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి మాంసంను కొనుగోలు చేసి అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇప్పటికే పలు ఫిర్యాదులు రావడంతో అధికారులు దాడులు నిర్వహించారు. కానీ విక్రయదారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు.
నిల్వ ఉంచిన మాంసంతో వెరైటీ ఐటెమ్స్
నవంబర్ 4వ తేదీన ఫుడ్ ఇన్స్పెక్టర్ వీఎంసీ వెటరనరీ అధికారులు 400 కిలోల కుల్లిపోయిన మాంసంను గుర్తించారు. ఇదంతా విజయవాడలోని బందర్ రోడ్డులోని ఓ రెస్టారెంటులో నిల్వ ఉంచారు. నిల్వ ఉంచిన ఈ మాంసంతో వివిధ రకాల నాన్వెజ్ ఐటెమ్స్ను ఆ రెస్టారెంటు తయారు చేసి వచ్చిన కస్టమర్లకు వడ్డిస్తోంది. భవానీ పురంలోని గొల్లపాలెం గట్టు రోడ్డులో మటన్ వ్యాపారస్తులపై ఈ నెల 8వ తేదీన అధికారులు దాడులు నిర్వహించిన 400 కిలోల కల్తీ మటన్ను సీజ్ చేశారు. వీరంతా నగరంలోని ప్రముఖ హోటల్స్కు రెస్టారెంట్లకు మటన్ను సప్లయ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Recommended Video
మటన్ బీఫ్ కలిపి....
ఇక దాడుల సమయంలో స్వాధీనం చేసుకున్న మటన్లో పురుగులు ఉన్నట్లు అధికారులు గమనించారు. ఫ్రిడ్జ్లో ఎక్కువ కాలం నిల్వ ఉంచిన మటన్ తింటే ఆరోగ్యం దెబ్బతినడం ఖాయమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఒడిషా రాజధాని భువనేశ్వర్ నుంచి రైలులో 100 మేకల తలకాయలను విజయవాడకు రవాణా చేస్తుండగా అధికారులు వాటిని సీజ్ చేశారు. మరో వైపు నిల్వ చేసి ఉన్న 100 కేజీల చేపలను రామలింగేశ్వర నగర్లోని చేపల మార్కెట్ నుంచి అధికారులు సీజ్ చేశారు. ఈ నెల 15వ తేదీన మటన్లో బీఫ్ను కలిపి విక్రయిస్తున్న సమయంలో దాన్ని సీజ్ చేశారు అధికారులు. కరెన్సీ నగర్, రామచంద్ర నగర్లో మటన్ బీఫ్ కలిపి విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు.