పరారీలో విజయవాడ రమేష్ ఆస్పత్రి యజమాని రమేష్ బాబు- పోలీసుల ప్రకటన- తీవ్ర గాలింపు..
విజయవాడ స్వర్ణాప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాదం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. అగ్నిప్రమాదంలో పది మంది రోగుల ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణంగా ఆరోపణలు ఎధుర్కొంటున్న రమేష్ ఆస్పత్రికి చెందిన ముగ్గురు ఉద్యోగులను నిన్న విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదే క్రమంలో ఆస్పత్రి యజమాని పోతినేని రమేష్ బాబు పరారీలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.
కోవిడ్ కేర్ సెంటర్ కోసం స్వర్ణ ప్యాలెస్ తో ఎంఓయూ కుదుర్చుకున్న రమేష్ ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కొడాలి రాజగోపాల్ రావు తో పాటు జనరల్ మేనేజర్ కూరసాటి సుదర్శన్, నైట్ షిఫ్ట్ మేనేజర్ పొల్లబోతు వెంకటేష్ లను నిన్న విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
వీరి నుంచి అందిన సమాచారం మేరకు రమేష్ ను ప్రశ్నించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరని తెలిసింది. ఆరా తీస్తే రమేష్ బాబు పరారీలో ఉన్నట్లుగా తెలుసుకుని ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. అయితే ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.
Recommended Video
మరోవైపు ఈ కేసులో పోలీసు విచారణతో పాటు ప్రభుత్వం నియమించిన రెండు వేర్వేరు కమిటీలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఈ కమిటీల నివేదిక ప్రభుత్వానికి అందే అవకాశాలు ఉన్నాయి. దీని ఆధారంగా నగరంలోని రమేష్ ఆస్పత్రిని సీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు రోగులు ఇక్కడ చికిత్స పొందుతున్న నేపథ్యంలో దీని సాధ్యాసాధ్యాలపై అధికారులు చర్చలు జరుపుతున్నారు.