గంజాయి మత్తులో బెజవాడ విద్యార్థులు -2 రోజుల్లో 55 మందిని పట్టుకున్న పోలీసులు
విజయవాడలో విద్యార్ధులు గంజాయి మత్తులో తూగుతున్నారు. పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా నగరంలోకి గంజాయి రాకను అడ్డుకోలేకపోతున్నారు. దీంతో గంజాయి సేవిస్తున్న విద్యార్ధుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇందులో బెజవాడలోని దాదాపు అన్ని ప్రధాన కాలేజీల విద్యార్ధులు ఉన్నారు. వీరికి విశాఖతో పాటు పలు చోట్ల నుంచి గంజాయి లభిస్తున్నట్లు తెలుస్తోంది.
విజయవాడ నగరంలో గంజాయి సేవిస్తున్న 55 మంది విద్యార్ధులను పోలీసులు రెండు రోజుల వ్యవధిలో అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి తీసుకున్న సమాచారం ఆధారంగా గంజాయి వీరికి అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. దీంతో ఈ వ్యవహారం నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. గంజాయి తీసుకుంటున్న వారిలో నగరానికి చెందిన ఎస్ఆర్ఆర్, కేబీఎన్, లయోలా, ఎన్నారై, ఎంఐసీ కాలేజీల విద్యార్ధులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
భారీ ఎత్తున్న విద్యార్ధులు గంజాయి సేవిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడులు నిర్వహించి వరుసగా విద్యార్ధులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇలా అదుపులోకి తీసుకున్న విద్యార్ధులను డీ అడిక్షన్ సెంటర్లకు తరలిస్తున్నారు. వారి తల్లితండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న విద్యార్ధుల్లో 12 మంది బీటెక్, 20 మంది ఇంటర్, డిగ్రీ, టెన్త్చదువుతున్నట్లు గుర్తించారు. వీరంతా పేపర్ సిగరెట్ ద్వారా గంజాయి తీసుకుంటున్నట్లు తేలింది. ఈ వ్యవహారం సంచలనం కావడంతో విద్యార్ధులపై నిఘా పెట్టాలని అన్ని కాలేజీల ప్రిన్సిపాల్స్కు పోలీసులు లేఖలు రాస్తున్నారు.