విజయవాడ గ్యాంగ్ వార్ - పోలీసుల కీలక నిర్ణయం.. సందీప్, పండు గ్రూపుల నగర బహిష్కరణ
సుదీర్ఘ విరామం తర్వాత విజయవాడలో ప్రజలను గ్యాంగ్ వార్ తో భయభ్రాంతులకు గురి చేసిన రెండు గ్యాంగ్ పై కఠిన చర్యలకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ కేసులో 37 మందిని అరెస్టు చేసిన పోలీసులు... మరో 13 మంది కోసం గాలిస్తున్నారు. తాజాగా వీరందరినీ నగర బహిష్కరణ చేయాలని నిర్ణయించడం కలకలం రేపుతోంది. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడే వారికి ఇదో హెచ్చరికగా ఉండాలని పోలీసులు భావిస్తున్నారు.
విజయవాడలో గ్యాంగ్ వార్ కు కారణమైన బిల్డర్లను ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన పోలీసులు... ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అందరినీ నగర బహిష్కరణ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రెండు గ్యాంగులను నగరం నుంచి బహిష్కరిస్తూ డీసీపీ హర్షవర్ధన్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ రెండు గ్యాంగుల్లో ఉన్న అందరూ నగరం విడిచి వెళ్లాలని డీసీపీ ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఈ కేసులో ఇప్పటి వరకు పండు గ్యాంగ్కు 17 మంది, సందీప్ కుమార్ గ్యాంగుకు చెందిన 16 మందిని అరెస్ట్ చేశారు. పండు, సందీప్ గ్యాంగుల మధ్య గొడవకు కారణమైన బిల్డర్లు ధనేకుల శ్రీధర్, ప్రదీప్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.... వీరి మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరిస్తానని చెప్పి ఒప్పందం కుదుర్చున్న భట్టు నాగబాబును కూడా అదుపులోకి తీసుకున్నారు. నిన్న అదుపులోకి తీసుకున్న పండు, నాగబాబు, ప్రదీప్రెడ్డిలను నేడు కోర్టులో పరుస్తున్నారు.