కరోనా కన్నీటి గాథ : తల్లి అంత్యక్రియలకు కూడా వెళ్లకుండా విధుల్లో విజయవాడ ఎస్సై..
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తెచ్చిన విపత్తును ఓవైపు, అందులో నుంచి పుట్టుకొస్తున్న కన్నీటి గాధలను నిత్యం చూస్తూనే, చదువుతూనే ఉన్నాం. కానీ తాజాగా ఏపీలోని విజయవాడలో కరోనా విధుల్లో ఉన్న ఎస్సై విధి నిర్వహణలో చూపిన నిబద్ధత ఇప్పడు పోలీసు శాఖలోనే కాదు సాధారణ ప్రజల్లో సైతం చర్చనీయాంశమవుతోంది. విధి నిర్వహణలో అతను చూపిన నిబద్ధతకు ప్రజలు సైతం సలాం కొడుతున్నారు.
తల్లి అంత్యక్రియలకు కూడా వెళ్లకుండా విధి నిర్వహణ..
ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన శాంతారాం విజయవాడలో కొన్నేళ్లుగా పోలీసు శాఖలో సబ్ ఇన్ స్పెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత నెలలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో ప్రస్తుతం నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ విధుల్లో ఉంటున్నారు. కానీ తాజాగా విజయనగరంలో అనారోగ్యంతో ఉన్న శాంతారాం తల్లి చనిపోయినట్లు కుటుంబ సభ్యుల ద్వారా వార్త అందింది. ఓవైపు కరోనా వైరస్ లాక్ డౌన్ విధులు.. మరోవైపు కన్నతల్లిని చివరి చూపు చూసుకోవాలన్న ఆతృత. ఈ రెంటిలో ఏది ఎంచుకోవాలని మిగతా వారు ఆలోచిస్తారేమో కానీ శాంతారాం ఆలోచించలేదు.
అంత్యక్రియలకు వెళ్లరాదని నిర్ణయం..
విజయనగరం జిల్లాలోని స్వస్ధలంలో తల్లి అంత్యక్రియలు జరుగుతున్నా.. కరోనా వైరస్ లాక్ డౌన్ విధులను వీడి వెళ్లేందుకు శాంతారాం మనసు అంగీకరించలేదు. స్టేషన్ లో పనిచేస్తున్న మిగతా సిబ్బందితో పాటు ఉన్నతాధికారులు సైతం వెళ్లేందుకు అంగీకరించినా.... శాంతారాం మాత్రం ససేమిరా అన్నారు. విజయనగరంలో ఉన్న తన సోదరుడికి నచ్చజెప్పి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేయించి తల్లిని చివరి చూపు చూడకుండానే బాధను మనసులోనే దిగమింగుకుని ఉండిపోయారు.
తల్లిని కడసారి చూడలేక.. వెళ్లలేక, ఉండలేక..
ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ పరిస్ధితుల్లో విజయవాడ నుంచి విజయనగరం వెళ్లాలంటే నాలుగు జిల్లాలు, 40 చెక్ పోస్ట్ లు దాటి వెళ్లాల్సిందే. తల్లి అంత్యక్రియలు ముగిశాక విజయవాడ తిరిగి వచ్చాక ఎలాగైనా క్వారంటైన్లో ఉండాల్సి వస్తుందని శాంతారాం భావించారు. దీంతో మూడు వారాల డ్యూటీ పోతుంది. కాబట్టి ఇన్ని రోజుల పాటు విధులకు దూరంగా ఉండటం కంటే తమ్ముడికి చెప్పి అంత్యక్రియలను వీడియో ద్వారా చూసుకుని సంతృప్తి చెందారు శాంతారాం.
శాంతారాం నిబద్ధతకు పోలీసుల సలాం..
విధి నిర్వహణలో శాంతారాం చూపిన నిబద్ధత తానొక్కడినే కాదు ఇప్పుడు తన స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బందిని సైతం ఆలోచనలో పడేస్తోంది. అంతకు మించి వారికి కన్నీళ్లు తెప్పిస్తోంది. ఇన్నాళ్లూ తమతో కలిసి పనిచేసిన శాంతారాం కన్నతల్లి చనిపోయినా వెళ్లకుండా విధి నిర్వహణకే అంకితం కావడం భావి తరాలకు సైతం గుర్తిండిపోతుందని ఆయనతో పాటు విధుల్లో ఉన్న పోలీసులు చెబుతున్నారు.