రామ్ గోపాల్ వర్మ ప్రెస్ మీట్ వల్ల రెండు వర్గాల మధ్య ఘర్షణ: శాంతిభద్రతలకు విఘాతం: విజయవాడ పోలీసులు
అమరావతి: దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అదుపులో తీసుకున్న ఉదంతంపై విజయవాడ పోలీసులు స్పందించారు. రామ్ గోపాల్ వర్మతో పాటు ఆయన దర్శకత్వం వహించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి, యూనిట్ సభ్యులందరితో బలవంతంగా హోటల్ గదులను ఖాళీ చేయించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని గన్నవరం విమానాశ్రయంలో వదిలేశారు. వెంటనే విజయవాడను వదిలి వెళ్లాలంటూ ఆదేశించారు. సాయంత్రం 4 గంటలకు విజయవాడ పైపుల రోడ్డులోని ఎన్టీఆర్ జంక్షన్ వద్ రామ్ గోపాల్ వర్మ పెట్టదలిచిన ప్రెస్ మీట్ ను కూడా పోలీసులు రద్దు చేశారు. ప్రెస్ మీట్ కు అనుమతి ఇవ్వలేదు. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందన అంశంపై విజయవాడ పోలీసులు స్పందించారు. వివరణ ఇచ్చారు.
ఆర్జీవీ ప్రెస్ మీట్ వల్ల రెండు వర్గాల మధ్య ఘర్షణ
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్వహించ తలపెట్టిన ప్రెస్ మీట్ వల్ల రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకునే ప్రమాదం ఉందంటూ పలువురు స్థానికులు అనుమానాలను వ్యక్తం చేశారని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ అధికారులు తెలిపారు. ప్రెస్ మీట్ కు అనుమతి ఇవ్వకూడదని తమకు ఫిర్యాదులు చేశారని అన్నారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా తాము ప్రెస్ మీట్ కు అనుమతి ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. ఎన్టీఆర్ జంక్షన్ బహిరంగ ప్రదేశమని, అలాంటి చోట్ల ఎవరినైనా కించపరిచే వ్యాఖ్యలు చేస్తే, శాంతిభద్రతల సమస్య తలెత్తు తుందని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. శాంతి భధ్రతల సమస్య తలెత్తితే ఆస్తి, ప్రాణ నష్టం జరిగే అవకాశముందని తెలిపారు. అందుకే రాం గోపాల్ వర్మ ప్రెస్ మీట్కు అనుమతిని నిరాకరించినట్లు విజయవాడ పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఎన్నికల కోడ్ కూడా అడ్డంకే..
సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉందని, ఈ కారణంగా విజయవాడలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్, సెక్షన్ 144 అమలులో ఉన్నాయని గుర్తు చేశారు. 144 అమల్లో ఉన్న సమయంలో బహిరంగ ప్రదేశాలో ఎలాంటి సమావేశాలు, సభలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఒకవేళ సభలు, సమావేశాలు నిర్వహించుకోవాలంటే ముందస్తు అనుమతులు తప్పనిసరి అని తేల్చి చెప్పారు. అంతేకాకుండా రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై తలపెట్టిన ప్రెస్మీట్ కార్యక్రమానికి ఎంచుకున్న ప్రదేశం పైపుల రోడ్ నిత్యం హైదరాబాద్కు వెళ్లే వాహనాలతో రద్దీగా ఉంటుందని దీనివల్ల అత్యవసర సర్వీసులకు ఆటంకం ఏర్పడే ప్రమాదముందని పోలీసులు అన్నారు.