Vijayawada : అడ్డగోలు దోపిడీ .. అక్కడ మాస్కులు , శానిటైజర్ల ధరలు తెలిస్తే షాక్ అవుతారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కరోనా జాగ్రత్తలలో భాగంగా వినియోగించే మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులతో పాటు ఇతర కోవిడ్ నియంత్రణకు వినియోగించే సామాగ్రికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. దీంతో వీటిని అమ్మకం చేస్తున్న వ్యాపారులు వీటి ధరలను అడ్డగోలుగా పెంచేశారు. ప్రస్తుతం ప్రజలకు కరోనా నియంత్రణా సామాగ్రి అవసరం ఉన్న దృష్ట్యా కొనుగోలు చేయక తప్పని పరిస్థితి ఉంది.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో శానిటైజర్ లకు, మాస్కులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. విజయవాడలో మాస్కులు , శానిటైజర్ లను విక్రయిస్తున్న వ్యాపారులు అడ్డగోలుగా ధరలను పెంచి విక్రయిస్తున్న తీరుతో కస్టమర్లు గగ్గోలు పెడుతున్నారు. సాధారణంగా ఏడు వందల రూపాయలకు విక్రయించే శానిటైజర్ ను , ఇప్పుడు 14 వందల రూపాయలకు అమ్ముతున్నారు. ఒక చిన్న 50 మిల్లీలీటర్ల శానిటైజర్ ధర 50రూపాయలు ఉందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
కర్ఫ్యూ సమయం కావడం వల్ల మెడికల్ స్టోర్స్ వద్ద జనాలు వీటికోసం బారులు తీరుతున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల ఇదే అదునుగా చూసుకొని నకిలీ శానిటైజర్లను విక్రయిస్తున్నారు కొందరు అక్రమార్కులు. ఒకపక్క కరోనా విజృంభణతో పాటుగా, మరోపక్క కరోనా మహమ్మారిని కట్టడిచేసే జాగ్రత్తలు పాటించడానికి వినియోగించాల్సిన సామాగ్రి ధరలు కూడా విజృంభిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న ప్రజానీకం, ప్రాణాలను కాపాడుకోవడం కోసం వారు పెంచిన ధరలను చెల్లించి మరీ శానిటైజర్ లను, మాస్క్ లను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.