విజయవాడలో మందుబాబులకు షాక్- గొడుగు, మాస్క్ లేకపోతే నో లిక్కర్....
విజయవాడలో కరోనా వ్యాప్తి నానాటికీ పెరుగుతోంది. ప్రతీ రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. జనం ఇళ్ల నుంచి బయటికి వచ్చే పరిస్ధితి లేదు. అయినా మద్యం షాపుల వద్ద మాత్రం రద్దీ తగ్గడం లేదు. ప్రభుత్వం మద్యం ధరలు పెంచినా, ఎప్పుడూ కనీవినీ ఎరుగని బ్రాండ్లు తీసుకొచ్చి మద్యం విక్రయాలను నిరుత్సాహపరిచేందుకు ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండటం లేదు. మద్యం షాపుల వద్ద పెరుగుతున్న రద్దీ కూడా కరోనాకు ఓ కారణంగా భావిస్తున్న అధికారులు.. ఈ మేరకు భౌతిక దూరం నిబంధనలను కఠిన తరం చేశారు.
బెజవాడలో కరోనా వ్యాప్తి....
విజయవాడలో గతంలో ఎన్నడూ లేనంత స్ధాయిలో కరోనా వ్యాప్తి పెరిగింది. దుర్గ గుడితో పాటు నగరంలో జనం ఎక్కువగా గుమి కూడా ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. కరోనా కేసులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. రోగులను హోం క్వారంటైన్ లోనే ఉంచి చికిత్స అందించాల్సిన పరిస్ధితి. దీంతో అధికారులు ఇప్పటికే నగరంలో కేసులు ఎక్కువగా నమోదవుతున్న పలు ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి ఆంక్షలను కఠిన తరం చేస్తున్నారు. రాకపోకలను సైతం నియంత్రిస్తున్నారు. తాజాగా మద్యం షాపుల ద్వారా కూడా కరోనా వ్యాప్తి పెరుగుతుందని గుర్తించిన మున్సిపల్ అధికారుల సూచనతో ఎక్సైజ్ శాఖ కూడా మద్యం షాపుల వద్ద భౌతిక దూరం ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని కోరుతోంది.
గొడుగు, మాస్క్ ఉంటేనే మద్యం..
ప్రస్తుతం విజయవాడలోని మద్యం షాపుల్లో కొనుగోళ్ల కోసం వచ్చే వారికి గొడుగుతో పాటు మాస్క్ ను తప్పనిసరి చేశారు. కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో గొడుగు ఎంతో కీలకమని భావిస్తున్న నేపథ్యంలో గొడుగుతో వస్తేనే మద్యం అమ్ముతామని షాపు యజమానులు తేల్చి చెబుతున్నారు. గొడుగు లేకుండా మద్యం కోసం వచ్చే వారిని నిర్దాక్షిణ్యంగా వెనక్కి పంపిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ కానిస్టేబుళ్లను కాపలా పెట్టి మరీ మందుబాబులను పలుచోట్ల నియంత్రిస్తున్నారు. దీంతో వారు కూడా గొడుగు లేకుండా వచ్చేందుకు జంకుతున్నారు. అలాగే మాస్క్ ను కూడా తప్పనిసరి చేశారు. మాస్క్ లేకపోయినా మద్యం అమ్మబోమని షాపు యజమానులు తెగేసి చెబుతున్నారు..
Recommended Video
ఆంక్షలపై వ్యతిరేకత...
ఇప్పటికే మద్యం ధరలను దేశంలో ఎక్కడా లేనంత స్ధాయిలో పెంచేసిన ప్రభుత్వం... మందుబాబులు రెగ్యులర్గా తాగే బ్రాండ్లను సైతం విక్రయించడం మానేసింది. కరోనా కారణంగా మద్యం షాపులను కూడా పరిమితంగానే తెరుస్తున్నారు. దీంతో ఈ బాధలు పడలేక ఇప్పటికే జనం శానిటైజర్లు తాగేస్తుండగా.. తాజాగా ప్రభుత్వం కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేస్తుండటంతో మందుబాబులకు చిర్రెత్తుకొస్తొంది. దీంతో నగరంలో పలుచోట్ల మద్యం దుకాణాల వద్ద సిబ్బందితో వీరు వాగ్వాదాలకు దిగుతున్నారు. కొన్ని చోట్ల ఇవి శృతి మించడంతో ఎక్సైజ్ కానిస్టేబుల్స్ జోక్యం చేసుకోవాల్సిన పరిస్ధితి ఉంటోంది. అయినా తాము ఆంక్షలు అమలు చేసి తీరుతామని ఎక్సైజ్ శాఖ చెబుతోంది.