విజయవాడలో వైసీపీ ఫ్లెక్సీల కలకలం- కోర్టులకు వ్యతిరేకంగా.. ఏకంగా జగన్ బొమ్మతోనే...
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో వెలువడుతున్న పలు తీర్పులపై అధికార పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే హైకోర్టు ఏపీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని ఏకంగా పార్లమెంటు సాక్షిగానే వైసీపీ ఎంపీలు విమర్శలు గుప్పిస్తున్నారు. హైకోర్టు తీర్పులపై తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీ సందర్భంగా సీఎం జగన్ ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విజయవాడలో కనకదుర్గ వారధిపై వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వానికి మద్దతుగా ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలు వివాదాస్పదంగా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా వీటిపై చర్చ జరుగుతోంది.
కేసుల భయంతోనే బీజేపీకి మద్దతు-వైసీపీ గుట్టు బయటపెడ్డిన కాంగ్రెస్- సాయిరెడ్డే కారణం..
వైసీపీ ఫ్లెక్సీల కలకలం...
విజయవాడలో ఎప్పుడూ రద్దీగా కనిపించే కనకదుర్గ వారధిపై మొన్న అర్ధరాత్రి వైసీపీ నేతలు కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది వైసీపీ ట్రేడ్ యూనియన్ నేతలే. ఇందులో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్తో పాటు సీఎం జగన్ ఫొటోలు కూడా ఉన్నాయి. అయితే ఇవి రాజకీయ పార్టీలు సాధారణంగా ఏర్పాటు చేసుకునే ఫ్లెక్సీలు కావు. వీటిపై రాసిన పలు అంశాలు తీవ్ర వివాదాస్పదంగా ఉన్నాయి. వ్యవస్ధలను బెదిరించేలా ఉన్నాయి. ప్రజల ద్వారా గెలిచిన ప్రభుత్వం మాది అంటూ మొదలుపెట్టి ఈ ఫ్లెక్సీలపై రాసిన రాతలు విజయవాడ, గుంటూరు మధ్య రాకపోకలు సాగించ పలువురి కంట పడ్డాయి. దీంతో వివాదం మొదలైంది.
కోర్టులు మమ్మల్నే ప్రశ్నిస్తాయా అంటూ...
ఈ వివాదాస్పద ఫ్లెక్సీలపై " రాజ్యాంగ వ్యవస్థల పేరుతో మా ప్రభుత్వానికి సంకెళ్ళు వెయ్యాలని ప్రయత్నాలు చేస్తే మేము ఊరుకోం. మా ప్రభుత్వం ప్రజల అభిమానం ఆమోదం పొంది గెలిచింది, మా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు" అంటూ రాశారు. ఇలాంటి ఫ్లెక్సీలు పదుల సంఖ్యలో వారధిపై ఏర్పాటు చేశారు. వైసీపీ టీయూసీ నాయకుడు మాదు శివరామ కృష్ణ పేరుతో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. రాజకీయ పార్టీలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం, అందులో నేతలకు మద్దతుగా రాతలు రాసుకోవడం చూస్తుంటాం. కానీ ఇందులో నేరుగా కోర్టుల పేరు చెప్పకపోయినా అదే అర్ధం వచ్చేలా రాతలు ఉండటం కలకలం రేపుతోంది.
Recommended Video
ఏకంగా జగన్ బొమ్మతోనే...
ఈ ఫ్లెక్సీలపై ఏకంగా సీఎం జగన్మోహన్రెడ్డి బొమ్మ కూడా ఉండటంతో ఆయన్ను ఈ వివాదంలోకి లాగినట్లయింది. సీఎం జగన్ కావాలంటే నేరుగా వ్యాఖ్యలు చేస్తారే కానీ ఇలా ఫ్లెక్సీల రాజకీయం చేయరని వైసీపీ నేతలు చెబుతుంటారు. దీంతో అసలు ఈ ఫ్లెక్సీల్లోని వ్యాఖ్యలు ఎవరిని టార్గెట్ చేసి పెట్టారు ? మా ప్రభుత్వాన్ని అడ్డుకుంటే ఊరుకోం అంటే, వార్నింగ్ ఇస్తున్నారా ? ఎవరిని బెదిరించటానికి ఇంత బహిరంగంగా, ఈ ఫ్లెక్సీలు పెట్టారు అనే చర్చ మొదలైంది. రాజ్యాంగ సంస్థ అని చెప్పి మరీ, వార్నింగ్ ఇస్తున్నారు. మా ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచింది, మేము ఏమైనా చేస్తాం, మీరు ఎవరు ప్రశ్నించటానికి అనే ధోరణి సరైనదేనా అన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే వైసీపీ ఎంపీలు కోర్టుల తీర్పులపై పార్లమెంటులో ప్రస్తావిస్తుండగా.. మంత్రులు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఈ ఫ్లెక్సీల ద్వారా ఏం సందేశం ఇవ్వబోతోందన్న చర్చ సాగుతోంది.