సీఎం జగన్ వర్సెస్ చంద్రబాబు: ఏది రాసినా భరించాలా: పులివెందుల పంచాయితీ సాగదు..!
ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్..ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం మీడియాకు సంబంధించి జారీ చేసిన జీవో 2430 గురించి వాడి వేడి చర్చ జరిగింది. ఈ సమయంలో టీడీపీ సభకు వచ్చే ముందు నిరసన చేపట్టింది. ఆ తరువాత సభలో దీని గురించి ప్రస్తావించారు. దీనికి ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. ఆ జీవోలో ఎటువంటి తప్పు లేదన్నారు. మీరు ఏది రాసినా భరించాలా అని ప్రశ్నించారు. జీవో ఇంగ్లీషులో ఉండటంతో చంద్రబాబుకు అర్దం కాలేదేమో అని ఎద్దేవా చేసారు. దీనికి చంద్రబాబు సైతం స్పందించారు. తనకు ఇంగ్లీషు రాదని సీఎం చులకనగా మాట్లాడుతున్నారని..అదే విధంగా అసెంబ్లీలో పులివెందుల పంచాయితీ సరి కాదని హెచ్చరించారు. వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పత్రికా స్వేచ్చకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారని..ఈ జీవో పైన జాతీయ మీడియాలో వ్యతిరేకంగా కధనాలు వచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేసారు.
చంద్రబాబు పై స్పీకర్ సీరియస్: ప్రతిపక్ష నేత సస్పెన్షన్ కు డిమాండ్: అసెంబ్లీలో రగడ..!
మీరు ఏం రాసినా భరించాలా..
జీవో నెంబర్ 2430 పైన ప్రతిపక్ష నేత నిరసన వ్యక్తం చేసారు. మీడియా స్వేచ్చపైన ఆంక్షలు వద్దని డిమాండ్ చేసారు. దీని పైన ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. అసలు ఆ జీవోలో ఏం తప్పుందని ప్రశ్నంచారు. ఆ జీవో ఇంగ్లీషులో ఉండటంతో చంద్రబాబుకు అర్దం కాలేదేమో అంటూ జీవో చదివి వినిపించారు. దురుద్దేశ పూర్వకంగా వార్త రాస్తే దాని పైన ఖండన ఇవ్వాలని..స్పందించకపోతే వారి పైన న్యాయ పరంగా చర్యలు తీసుకొనే అధికారం సంబంధిత అధికారులకు ఇస్తూ ఆ జీవో ఇచ్చామని వివరించారు. మీకు మద్దతుగా ఉండే పత్రికలు దురుద్దేశ పూర్వకంగా కధనాలు రాస్తే మాట్లాడకుండా కూర్చోవాలా అని ప్రశ్నించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకొనే వ్యక్తికి కనీస నాలెడ్జ్ లేదని విమర్శించారు. ఈ జీవో ఏ ఒక్క మీడియా సంస్థను ఉద్దేశించి జారీ చేసింది కాదని స్పష్టం చేసారు.
పులివెందుల పంచాయితీ సాగదు..
ముఖ్యమంత్రి చెప్పిన వివరణ పైన చంద్రబాబు స్పందించారు. తనకు ఇంగ్లీషు రాదని చులకనగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాడు జారీ చేసిన జీవో పైన పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అయిందని..ఆ వెంటనే ఆయన పత్రికాస్వేచ్చను కాపాడటానికి ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారని వివరించారు. మీడియా మీద ఆంక్షలు సరికాదన్నారు. జాతీయ మీడియా సైతం ఈ నిర్ణయాన్ని తప్పు బడుతోందని గుర్తు చేసారు. తాను ఎస్వీ యూనివర్సిటీ లో చదివానని ..జగన్ ఎక్కడ చదివారో తనకు తెలియదన్నారు.సీఎం చెబితే తాను అక్కడకు వెళ్లి చదువుకుంటానని చెపపుకొచ్చారు. పులివెందుల పంచాయితీ సభలో చేయకండి అంటూ హెచ్చరించారు. తమ పైన..తమ మహిళా ఎమ్మెల్సీల పైన దురుసుగా ప్రవర్తించిన చీఫ్ మార్షల్ పైన చర్యలు తీసుకోకుంటే తాము సభకు వచ్చి ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. ఏ ఒక్కరినో లక్ష్యంగా చేసుకొని ఈ జీవోలు వద్దని.. వెంటనే ఆ జీవో విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేసారు.
చంద్రబాబు హాయంలోనూ ఇచ్చారు..
శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి బుగ్గన సైతం చంద్రబాబు హాయంలో ఇచ్చిన జీవోలను ప్రస్తావించారు. పోలవరం నిర్వాసితుల పైనా.. అమరావతి గురించి బాధితుల పక్షాన సాక్షిలో కధనాలు వచ్చిన సమయంలో మూడు సార్లు అధికారులకు సాక్షి యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ ప్రభుత్వం జీవోలు జారీ చేసారని గుర్తు చేసారు. ఈ జీవో అధికారి ఎవరైనా వారికి అధికారం కల్పించామని.. అంతే కానీ..ఏ ఒక్క పత్రికను ఉద్దేశించి జారీ చేసింది కాదని వివరించారు. అదే సమయంలో..చంద్రబాబు కారణంగా సింగపూర్ లోని ప్రముఖులు ఇబ్బంది పడుతున్నారని బుగ్గన ఎద్దేవా చేసారు. అసెంబ్లీ మార్షల్ పైన టీడీపీ నేతలే దురుసుగా ప్రవర్తించారంటూ వీడియోను సభలో ప్రదర్శించారు.