కృష్ణాజిల్లాలో దారుణం- మద్యం అక్రమ రవాణా- అడ్డుకున్న వాచ్ మెన్ మృతి...
కృష్ణాజిల్లాలో మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలో మద్యం ఓ కుటుంబంలో విషాదం నింపింది. అయితే ఇది మద్యం సేవించడం వల్ల కాదు. మద్యం అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు కావడం కలకలం రేపింది. స్ధానికంగా ఉండే ఓ వైన్ షాపు నుంచి ఇద్దరు ఉద్యోగులు లాక్ డౌన్ ఉన్నా అక్రమంగా మద్యం తరలిస్తుండగా.. కోటేశ్వరరావు అనే వాచ్ మెన్ అడ్డుకున్నాడు. దీంతో ఆగ్రహించిన వారు వాచ్ మెన్ పై దాడి చేసి మద్యాన్ని ఎత్తుకెళ్లారు. సీన్ కట్ చేస్తే అతను మృతుడై కనిపించాడు.
వైన్ షాప్ ఉద్యోగులతో వాగ్వాదం, దాడి తర్వాత మనస్తాపానికి గురైన వాచ్ మెన్ కోటేశ్వరరావు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్ధానిక పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. దీంతో విభేదించిన స్ధానికులు... వైన్ షాప్ ఉద్యోగులు తమ బండారం బయటపడుతుందనే భయంతోనే వాచ్ మెన్ కు పురుగుల మందు తాగించి చంపారని ఆరోపిస్తున్నారు.
ఈ కేసులో సమగ్రంగా విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసు స్టేషన్ ముందు స్ధానికులు బైఠాయించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. మృతుడు కోటేశ్వరరావు గతంలో స్ధానిక ఎంపీపీగా పనిచేయడంతో ఆయనకు మంచి పేరుంది. తాజా ఘటనతో స్ధానికులు కోపోద్రికులై నిరసనకు దిగడంతో పోలీసులు వారికి సర్దిచెప్పారు. విచారణ జరిపి దోషులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు.