పోలవరం పై జగన్ వైఖరి ఎంటి..!? పోల 'వరమా'..? పోల 'వైరమా'..?
అమరావతి/హైదరాబాద్ : ప్రభుత్వం మారింది. టీడిపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం భవితవ్వంపై అందరి దృష్టి నెలకొంది. బహుళార్ధ సాధక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నేపథ్యంలో కొత్త ప్రభుత్వం జల వనరుల శాఖను ఎవరికి అప్పగిస్తుందనే విషయంలో సర్వత్రా చర్చ జరుగుతోంది. కొత్త ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లాకు అధిక ప్రాముఖ్యత కల్పించనుందని తెలుస్తోంది. ప్రభుత్వ సలహాదారుగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ను ప్రభుత్వం నుంచి అడగవచ్చని తెలుస్తోంది. దీనికి తోడు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా వైఎస్ ప్రభుత్వంలో అనుమతుల దగ్గర నుంచి సర్వం తెలిసిన ఉండవల్లి కాబట్టి కనీసం ఈ ప్రాజెక్టు గురించి కూడా చాలా కీలకంగా భావించి ఆయన సహకారాన్ని కోరవచ్చని తెలుస్తోంది.
జగన్ ప్రాధాన్యలు ఏంటి..! పోలవరం పై వైఖరి ఎలా ఉండబోతోంది..!!
వైఎస్కు అప్పట్లో కేవీపీ ఆత్మగా ఉంటే, ప్రస్తుత ప్రభుత్వ సవాళ్లను దృష్టిలో పెట్టుకుని వైఎస్కు అత్యంత సన్నిహితుడుతైన ఉండవల్లి అరుణ్కుమార్ సేవలు వైఎస్ కుమారుడు జగన్ పొందవచ్చని సమాచారం. తండ్రికి కేవీపీ అయితే, తనయుడికి ఉండవల్లి అంటున్నారు. ఈ విధంగా జిల్లాకు మరింత ప్రాధాన్యత లభించనుందని అంచనా వేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు 70.17 శాతం పూర్తయింది. కొత్త ప్రభుత్వం కొలువు దీరే సమయం నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు కూడా ఎంత వేగంగా జరుగుతాయో అనేది చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వ ప్రాధాన్యత పనుల్లో కీలకమైన పోలవరం ప్రాజెక్టు, అమరావతి విషయంలో ప్రస్తుత ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉంటుందనే విషయంలో ఆసక్తి రేకెత్తుతోంది.
మంత్రులు శాఖలు..! భారీ నీటి పారుదల శాఖ ఎవరికో..!!
కొత్త కొలువులో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రిత్వ శాఖ ఎవరికి దక్కుతుందని చర్చ మొదలైంది. 30వ తేదీన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారని తెలియడంతో ఇంకా శాఖల విషయంలో కసరత్తు కొలిక్కి రాలేదని తెలుస్తోంది. నీటి పారుదల రంగంపై సమగ్రమైన అవగాహన కలిగిన ఎమ్మెల్యే ఈ శాఖ మంత్రిగా రావాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురి పేర్లు ప్రచారం జరుగుతోంది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యే గానీ, లేదంటే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారికి గానీ జల వనరుల శాఖ అప్పగించవచ్చని చెబుతున్నారు.
జగన్ స్వయంగా మానిటర్ చేసే అవకాశం..! అడ్డంకులు తొలిగేనా..!!
మరో వైపు జగనే తన చేతిలో ఉంచుకుంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. లేదంటే ఈ శాఖకు బుగ్గన, కోటగిరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా పోలవరం ప్రాజెక్టు ప్రధానంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తే అన్ని విధాలా మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ ప్రభుత్వం డిసెంబర్ నాటికి గ్రావిటీపై నీరిస్తామని చెప్పింది. డిసెంబర్ నాటికి గ్రావిటీపై నీరివ్వాలంటే ఇంకా చాలా పనులు పూర్తి కావాల్సి ఉంది. స్పిల్ వే, స్పిల్ వే ఛానల్, అప్రోచ్ ఛానల్ మట్టి పనులు గత ప్రభుత్వ హయాంలో 85.50 శాతం, స్పిల్ వేలు, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్ చానల్ క్రేవిసెస్ 74.80 శాతం, రేడియల్ గేట్స్ ఫ్యాబ్రికేషన్ 69.14 శాతం పనులు జరిగాయి.
ప్రతిష్టాత్మకంగా మారిన పునరావాసాలు..! నష్ట పరిహారం పై ప్రభుత్వ దృష్టి..!!
ఈ కాలువ పనులు ప్రధానంగా వై ఎస్ హయాంలోనే చాలావరకు పూర్తయ్యాయి. అయితే ప్రస్తుతం ప్రధానంగా కాఫర్ డ్యామ్ నిర్మాణాలు పూర్తవుతున్న క్రమంలో ముంపు గ్రామాలకు సంబంధించి పునరావాసం ప్రధానంగా ప్రస్తుత ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. నిర్వాసితులకు నాణ్యమైన ఇళ్లను నిర్మించడంతోపాటు చట్ట హక్కుల ప్రకారం పునరావాసాన్ని పూర్తిస్థాయిలో కల్పించాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కొత్త ప్రభుత్వం పోలవరంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి సత్వరం పూర్తయ్యేందుకు కార్యాచరణ తీసుకోవాల్సి ఉందని సర్వత్రా అభిప్రాయం పడుతున్నారు. కాని కాబోయే సీఎం జగన్ వైఖరి ఎలా ఉంటుందనే అంశంపై తారా స్థాయిలో చర్చ జరుగుతోంది.