హైదరాబాద్ ను ప్రపంచపటంలో పెట్టానన్నావ్..ఇండియా మ్యాప్ లో అమరావతి ఏదీ?: బీజేపీ
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి విమర్శలకు కేంద్రబిందువు అయ్యారు. ఈ సారి భారతీయ జనతాపార్టీ రాష్ట్రశాఖ నాయకులు లక్ష్యంగా చేసుకున్నారు. దీనికి ప్రధాన కారణం- ఇండియా పొలిటికల్ మ్యాప్. ఈ మ్యాప్ లో రాజధాని అమరావతిని కేంద్ర ప్రభుత్వం గుర్తించలేదు. రాజధాని లేని రాష్ట్రంగా అధికారికంగా గుర్తించినట్టయింది. దీనికి ప్రధాన కారణం.. గత తెలుగుదేశం ప్రభుత్వమేనని, రాష్ట్రాన్ని అయిదేళ్ల పాటు పాలించిన చంద్రబాబు కనీసం రాజధాని నగరాన్ని నిర్మించలేకపోయారని విమర్శిస్తున్నారు.
రాజధాని లేని ఏపీ: అన్ని తాత్కాలికం కావడం వల్లే: కొత్త పొలిటికల్ మ్యాప్ ను విడుదల చేసిన కేంద్రం..!
కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఇండియా పొలిటికల్ మ్యాప్ లో అమరావతికి చోటు దక్కలేదు. దేశంలో 29 రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్, లడక్ సహా తొమ్మిది కేంద్ర పాలిత ప్రాంతాల రాజధానులను పొందుపరిచింది.. ఒక్క ఏపీ మినహా. దీనిపై బీజేపీ నాయకులు చంద్రబాబును టార్గెట్ గా చేసుకున్నారు. హైదరాబాద్ ను ప్రపంచపటంలో నిలిపానని గొప్పలు చెప్పుకొన్న చంద్రబాబు నాయుడు.. ఏపీ రాజధాని పట్ల నిర్లక్ష్యం చేశారని, అంతర్జాతీయ స్థాయి డిజైన్ల పేరుతో డ్రామాలు ఆడారని ఆరోపిస్తున్నారు. అమరావతిని ఇండియా మ్యాప్ లో లేకుండా చేశారని మండిపడుతున్నారు.
మోసం చేయడం చంద్రబాబు సహజగుణమని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సోమగుంట విష్ణువర్ధన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. సింగపూర్ తరహా రాజధానిని నిర్మిస్తామని 2014 నాటి ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారాన్ని అందుకున్న ఆయన.. రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. తనకు అలవాటైన రీతిలో, తన సహజగుణంతో ఏపీ ప్రజలను మోసం చేశారని, ఏపీ చరిత్రలోనే క్షమించరాని తప్పు చేశారని అన్నారు. అయిదు కోట్ల మంది ఆంధ్రులను అయిదు సంవత్సరాల పాటు రాజధాని పేరుతో దారుణంగా వంచించారని చెప్పారు.
మోసం నీ సహజ గుణమని నిరూపించావ్ చంద్రబాబు..ఆంధ్రరాష్ట్ర చరిత్రలోనే క్షమించరాని తప్పు చేశావ్..
— Kanna Lakshmi Narayana (@klnbjp) November 3, 2019
5 కోట్ల మంది ఆంధ్రులను 5 సంరాలు రాజధాని పేరుతో మోసం చేసి,కేంద్ర నిధులు లెక్క చెప్పకుండా వేల కోట్లు ఖర్చుచేసి,ఆఖరికి దేశ చిత్రపటంలో ఏపీ రాజధాని అడ్రస్ లేకుండా చేసి తీరని ద్రోహం చేశావ్. pic.twitter.com/Rr6FMeKThX
రాజధాని నిర్మాణానికి కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేసిందని గుర్తు చేశారు. వాటి గురించి లెక్కలు అడిగితే ఎదురు తిరిగారని, ఆ నిధులకు ఎప్పటికైనా చంద్రబాబు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వేల కోట్లు తన విదేశీ పర్యటనలు, సొంత ఆడంబరాల కోసం ఖర్చుచేశారని ఆరోపించారు. హైదరాబాద్ ను ప్రపంచ పటంలో నిలిపానని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు ఆఖరికి దేశ చిత్రపటంలో ఏపీ రాజధాని అడ్రస్ లేకుండా చేసి తీరని ద్రోహం చేశారని అన్నారు.