ప్రాణాలతో వస్తామో లేదో ..!! చంద్రబాబుకు తమపై జరిగిన దాడిని చెప్పిన బొండా ఉమా , బుద్దా వెంకన్న
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలలో చోటు చేసుకుంటున్న ఘటనలు ఉద్రిక్తతలకు కారణం అవుతున్నాయి. తాజాగా మాచర్లలో టీడీపీ నేతల వాహనాలపై జరిగిన దాడి నేపధ్యంలో రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చని చెప్తున్నారు టీడీపీ నేతలు. ఒక్క టీడీపీ మాత్రమే కాదు ప్రతిపక్షాల నేతలు ఈ దాడులను ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. నేడు మాచర్లకు వెళ్ళిన టీడీపీ నేతలు బోండా ఉమా , బుద్దా వెంకన్నల కారుపై కొందరు దాడులు చేయడంతో , పెద్ద పెద్ద కర్రలతో కార్ల అద్దాలు పగలగొట్టటంతో మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇక బోండా ఉమా, బుద్దా వెంకన్నలకు కాల్ చేసి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు .
మమ్మల్ని చంపేస్తారా ? టీడీపీ నేతల మీద దాడిపై చంద్రబాబు సీరియస్
టీడీపీ నేతలకు మీడియా సమావేశంలోనే ఫోన్ చేసిన చంద్రబాబు
గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్న ప్రయాణిస్తోన్న కారుపై కొందరు పెద్ద, పెద్ద కర్రలతో దాడులు చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారు . స్థానిక ఎన్నికల నామినేషన్లు పరిశీలించేందుకు వెళ్తున్న టీడీపీ నేతలను అడ్డుకోవటం కోసం దాడికి పాల్పడ్డారు . ఈ ఘటనపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. మీడియా సమావేశంలో టీడీపీ నేతలకు ఫోన్ చేసి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. భయాందోళనకు గురి కావద్దని చెప్పారు.
ప్రాణాలతో వస్తామో లేదో నమ్మకం లేదన్న బోండా ఉమా
ఈ సందర్భంగా ఫోన్లో టీడీసీ సీనియర్ నేత బోండా ఉమ మాట్లాడుతూ.. తమ ప్రాణాలకు రక్షణ లేదని, తిరిగి వస్తామో లేదో కూడా తెలీదని చెప్పారు . నామినేషన్ వేసేందుకు వెళ్ళిన టీడీపీ నేతలను అడ్డుకున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్ళిన క్రమంలో , మాచర్ల వెళ్ళిన తమను వైసీపీ నేతలు అడ్డుకున్నారని చెప్పారు. టీడీపీ నేతలతో మాట్లాడి , పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలని మాట్లాడేందుకు వెళ్తుంటే తాము ప్రయాణిస్తున్న మూడు కార్లపై దాడి చేశారని , ఇష్టారాజ్యంగా కార్ల అద్దాలు ధ్వంసం చేసి తమ మీద దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు.
అడ్వొకేట్ తల పగిలిందని చెప్పిన టీడీపీ నేత
ఈ దాడిలో ఒక అడ్వొకేట్ తల పగిలిందని ఆయన అక్కడ నుండి తెలంగాణా బార్డర్ వైపు పారిపోయారని చెప్పారు. వైసీపీ కార్యకర్తల నుంచి తప్పించుకుని మార్కాపురం మీదుగా వెళ్తుండగా అక్కడి స్థానిక ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లతో ఎస్కార్ట్ ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. అయినప్పటికీ మోటార్ బైక్స్ పై తమని వెంబడించి ఇక పోలీసుల వాహన అద్దాలు సైతం పగలగొట్టారని పేర్కొన్నారు.
పోలీసులను వదలకుండా దాడులు చేస్తున్నారని చెప్పిన టీడీపీ నాయకులు
మార్గం మధ్యలో కారును ఆపి ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్ల పైనే కాకుండా డీఎస్పీ కూడా మీద కూడా దాడి చేశారని చెప్పారు. ఈ క్రమంలో తాము ప్రాణాలతో ఈ నియోజక వర్గం దాటి బయటకు వస్తామో రామో తెలీదని బోండా ఉమా అన్నారు. స్థానికంగా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసినా అక్కడికి కూడా వచ్చి అల్లరి మూకలు దాడి చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తీవ్ర గాయాల పాలై ఒళ్లంతా రక్తంతో ఉన్నామని బోండా ఉమ ఆవేదన వ్యక్తం చేశారు.
ఏం జరిగినా భయపడమని చెప్పిన బుద్దా వెంకన్న
ఇక తాము గాయాలపాలయ్యామని చెప్పిన బుద్దా వెంకన్న ఇలాంటి దాడులకు భయపడేది లేదని , రాష్ట్రంలో ప్రజా స్వామ్యం లేకుండా పోయిందని మండిపడ్డారు. ప్రస్తుతం తాము ప్రయాణంలోనే ఉన్నామని , ఎక్కడ , ఎవరు ఎలా అటాక్ చేస్తారో అన్న ఆందోళన ఉందని చెప్పారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని ఆయన పేర్కొన్నారు. ఇక చంద్రబాబు సైతం ఎప్పటికప్పుడు వార్ క్షేమ సమాచారం అందించాలని కోరారు.