అవి బుద్దుడి బోధనలా,ప్రవక్త సూక్తులా.?బెజవాడ టిక్ టాక్ వీడియో ప్రసారం దేనికి.?ఏది మీడియా నియంత్రణ?
అమరావతి/హైదరాబాద్ : గొంతు కోస్తావుంటే ఒకరకమైనా సుయ్...మనే సౌండ్ వస్తావుంటది. అంది వింటానికి మాహా రంజుగా ఉంటాదీ.. ఇది విజయవాడ రౌడీ గ్యాంగ్ లోని ఓ గ్యాంగ్ సభ్యుడి మొబైల్ ఫోన్ లో దొరికిన టిక్ టాక్ వీడియో. ఇది ఎవరిని భయపెట్టడానికి స్వయంగా చిత్రీకరించుకున్నాడో తెలియదు గానీ ప్రసార మాధ్యమాలు మాత్రం పదేపదే ఈ వీడియోని ప్రసారం చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజానికాన్ని భయభ్రాంతులకు గురి చేస్తునన్నాయి. వార్తా ప్రసారాల రంగంలో నెలకొన్న పోటీ మాటున సంచలనాలకోసం మీడియా ఎంత నియంత్రణ కోల్పోతుందో ఈ సంఘటన రుజువుచేస్తోంది.
నియంత్రణ కోల్పోతున్న మీడియా.. విజయవాడ రౌడీ టిక్ టాక్ వీడియో ప్రసారం ఎందుకంటున్న ప్రజలు..
బెజవాడ నరంలో బుసలు కొడుతున్న ఆదిపత్యపోరు పరాకాష్టకు చేరుకున్నట్టు తెలుస్తోంది. వీధి పోరాటాలతో మొదలైన పంతాలు రియల్ ఎస్టేట్ రంగంలో వాటాలు పంచుకోవడం వరకూ ముదిరిందంటే వ్యవహారం అదుపుతప్పినట్టు ఇట్టే అర్ధమవుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి రౌజీయిజం, గూండాయిజం లేకుండా ప్రశాంత వాతారణానికి విజయవాడ ప్రజలు అలవాటు పడ్డారు. కానీ పెరుగున్న రాజధాని సంస్కృతి, విస్థరిస్తున్న వ్యాపార సముదాయాలు, మారుతున్న కొత్తపోకడలతో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో విజయవాడ చుట్టు పక్కల ప్రాంతాల భూములకు ఎక్కడ లేని డిమాండ్ వచ్చి పడ్డట్టు తెలుస్తోంది. డిమాండ్ ఉన్నచోటే సప్లై కి బదులు చురకత్తుల స్వైరవిహారం ఉంటుందని విజయవాడ సంఘటన రుజువుచేస్తోంది.
పరాకాష్టకు చేరిన ఆదిపత్యపోరు.. వీడియో సందేశాలతో బెదిరింపులకు తెగబడుతున్న గూండాలు..
దీంతో ఆదిపత్యపోరు కూడా పెరిగి హింసాత్మక ఘటనలకు తావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మనకు సొంతం కానిది సొంతం కావాలంటే బెదిరించాలి, గాయపరచాలి, తలలు బద్దలు కొట్టాలి.. అయినా వినకపోతే నిర్ధాక్షిణ్యంగా మట్టుబెట్టాలి. ఇదీ ప్రస్తుతం అమరావతిలో పెరుగిపోతున్న విశృంఖలత్వం. ఆర్థిక పరమైన కారణాలు కావొచ్చు, ఆదిపత్యానికి సంబంధించిన కారణాలు కావొచ్చు అమరావతిలో మళ్లీ రౌడీయిజం పురుడుపోసుకున్నట్టు ఇటీవల జరిగిన పరిణామాలు నిర్ధారిస్తున్నాయి. భయానక పరిస్థితులు సృష్టించి, బెదిరింపులకు పాల్పడితే డబ్బు, హోదా రెండూ వస్తాయనే అపోహలో యువత పెడదారులు పడుతున్నట్టు తెలుస్తోంది.
రౌడీల వీడియో సందేశాలు ప్రసారం చేస్తున్న న్యూస్ ఛానళ్లు.. ఘాటుగా విమర్శిస్తున్న నెటిజన్లు..
అమరావతిలో ఆదిపత్యం, అజమాయిషీ కోసం జీవితాలను పణంగా పెడుతున్నారు కొంత మంది యువకులు. సులభంగా డబ్బులు సంపాదించే క్రమంలో అడ్డొచ్చిన వాళ్ళను అడ్డంగా నరకడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఆదిపత్యానికి అడ్డు తగులుతున్న అవతలి గ్యాంగును బెదింరించో, చంపేసో పంతం నెగ్గించుకోవాలని యువత విచక్షణ కోల్పోతున్నారు. ఆదిపత్యం చాటుకునే క్రమంలో వారిలో ఎంత కర్కషత్వం ఉందో. ఎంత ఉన్మాది లక్షణాలు ఉన్నాయో ఎదుటి వారికి చెప్పి భయపెట్టిచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు బెజవాడ వీధి రౌడీలు. అందుకు అందుబాటులో ఉన్న సాంకేతికతను వాడుకుంటున్నారు. తనలోని క్రూరత్వాన్ని అతి కిరాతకంగా వ్యవహరించే విధానాన్ని సులువుగా చిత్రీకరించి ప్రత్యర్థులకు పంపింస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారు నయా గూండాలు.
ఉన్మాదులకు ముసుగుతొడిగి మీడియా ముందు ప్రవేశపెట్టే వాళ్లు.. ఇప్పుడు హీరో రేంజ్ లో చూపిస్తున్న మీడియా సంస్థలు..
ఇంతవరకూ కథ రెండు రౌడీ మూకలకు సంబందించిందైనప్పటికి, వారి మద్య జరుగుతున్న సంభాషణలు, భీభత్సకరమైన వీడియో సందేశాలను ప్రసారమాధ్యమల్లో ప్రసారం చేయడం వల్ల సమాజానికి ఎలాంటి సందేశం పంపుతున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఓ ఉన్మాది మరో శాడిస్టుకోసం చిత్రీకరించుకున్న క్రూరమైన విడియోను యావత్ ప్రజానికానికి చూపించడం వల్ల ఏంటి ప్రయోజనమని నిలదీస్తున్నారు. ఈ విషయంలో నీతులు వల్లె వేసే మీడియా పూర్తిగా నియంత్రణ కోల్పోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడలోని రౌడీ మూకలోని సభ్యుడు వికృతంగా వేశం వేసుకుని అతి కిరాతకంగా మాట్లాడిని టేప్ ను యధాతథంగా ప్రసారం చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.