విజయవాడ అగ్నిప్రమాదంలో కులం కోణం- వైసీపీకి పనికొస్తుందా ? మెడకు చుట్టుకుంటుందా ?
విజయవాడలోని స్వర్ణాప్యాలెస్ హోటల్లో స్ధానిక రమేష్ ఆస్పత్రి నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్లో అగ్నిప్రమాదం జరిగి పది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో దర్యాప్తు ఊపందుకుంది. అయితే మొదటి రోజు కాస్త సంయమనం పాటించిన రాజకీయ పార్టీలు.. రెండో రోజు నుంచి మాత్రం పరస్పర విమర్శలకు దిగుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ నేతలు ఈ వ్యవహారంలో కులం కోణాన్ని తెరపైకి తీసుకురావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. దీన్నో ప్రమాదంగా మాత్రమే భావించి నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపించాల్సిన తరుణంలో కులం కోణం తెరపైకి రావడం అధికార పార్టీకి కలిసి వస్తుందా లేదా అన్న చర్చ సాగుతోంది.
ఆప్తులు కాబట్టే మౌనమా ? విజయవాడ అగ్నిప్రమాదంపై చంద్రబాబు తీరును తప్పుబట్టిన శ్రీకాంత్రెడ్డి
స్వర్ణప్యాలెస్ ప్రమాదంపై చురుగ్గా దర్యాప్తు...
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో రమేష్ ఆస్పత్రి నిర్వహించిన కోవిడ్ కేర్ సెంటర్లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంపై ప్రభుత్వం నియమించిన రెండు కమిటీలు రేపటి కల్లా నివేదిక ఇవ్వబోతున్నాయి. మరోవైపు ప్రభుత్వం కూడా వీటితో సంబంధం లేకుండానే ప్రాధమిక ఆధారాలను బట్టి రమేష్ ఆస్పత్రి యాజమాన్యానికి చెందిన ముగ్గురిని నిన్న రాత్రి అదుపులోకి తీసుకుంది. ఈ ఘటనతో తమకు సంబంధం లేదని రమేష్ ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించిన నేపథ్యంలో స్వర్ణప్యాలెస్ తో రమేష్ ఆస్పత్రి కుదుర్చుకున్న ఒప్పందం ఏంటి, లీజు విలువ ఎంత, ఇందులో ఎవరి బాధ్యత ఎంత అనే అంశాలపై దర్యాప్తు సాగుతోంది.
ఘటనలో తెరపైకి కులం కోణం..
తప్పెవరిదైనా పది మంది ప్రాణాలు గాల్లో కలిసి పోవడానికి కారణమైన ఈ ఘటనపై పూటకో చర్చ సాగుతోంది. రకరకాల కోణాలు తెరపైకి వస్తున్నాయి. స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నవారిని, కేవలం జ్వరంతో బాధపడుతున్న వారిని కూడా డబ్బుల కక్కుర్తితో స్వర్ణప్యాలెస్లో ఉంచి చికిత్స అందిస్తున్నారని నిర్ధారణ అయింది. అదే సమయంలో ఈ హోటల్ను లీజుకు తీసుకున్న రమేష్ ఆస్పత్రి యజమాని పోతినేని రమేష్ పాత్రపై ఇప్పుడు వైసీపీ రాజకీయ రచ్చ మొదలుపెట్టింది. అదీ కులం కుణంతో. కమ్మ కులానికి చెందిన పోతినేని రమేష్ టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడు కాబట్టే ఈ వ్యవహారంపై టీడీపీ నోరు మెదపడం లేదని నిన్న వైసీపీ నేత శ్రీకాంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి.
విమర్శలను దారి మళ్లించేందుకే ?
స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో ఎంత రమేష్ ఆస్పత్రి తప్పిదమని చెప్పుకుంటున్నా ప్రభుత్వానికి వీటిపై పర్యవేక్షణ ఎందుకు లేదనే ప్రశ్న ఎదురవుతోంది. దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్ధితుల్లో ఈ వ్యవహారాన్ని కూడా ఓ సాధారణ ఘటన తరహాలో కులం కోణాన్ని తెరపైకి తీసుకొచ్చి పక్కదోవ పట్టిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దర్యాప్తు ప్రాధమిక స్ధాయిలో ఉంది కాబట్టి సరిపోతోంది కానీ ఆ తర్వాత కోర్టుల వరకూ వస్తే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కాబట్టే మేం స్వర్ణప్యాలెస్ హోటల్లో కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు రమేష్ ఆస్పత్రి వాదించే అవకాశముంటుంది. అలాగే ప్రభుత్వ నిబంధనల మేరకే అనుమతులు పొందామని కూడా చెబుతుంది. అప్పుడు సహజంగానే ప్రభుత్వ నిర్లక్ష్యం తెరపైకి వస్తుంది. కానీ అంతకు ముందే ఈ వ్యవహారానికి కులం కోణం, టీడీపీ సంబంధాల కోణం అంటగట్టడం ద్వారా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలని వైసీపీ భావిస్తున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
Recommended Video
దర్యాప్తుపై నమ్మకం లేదా ?
ఇప్పటివరకూ ప్రభుత్వం ఈ ఘటనపై దర్యాప్తు కోసం రెండు వేర్వేరు కమిటీలు నియమించింది. అదే సమయంలో ఘటనకు బాధ్యులుగా రమేష్ ఆస్పత్రి యాజమాన్యానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఎలాగో కొన్ని లోపాలు, అంతకు మించిన కొత్త ప్రశ్నలు తెరపైకి రావడం ఖాయమే. అయితే దర్యాప్తు సక్రమంగానే నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పుకుంటోంది. అదే సమయంలో కులం కోణాన్ని, విపక్ష టీడీపీ పాత్రను తెరపైకి తెచ్చేందుకు వైసీపీ రాజకీయంగా చేస్తున్న ప్రయత్నాలు దర్యాప్తుపైనా ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. తదుపరి విచారణలో అధికారులు వైసీపీ నేతల విమర్శల ఆధారంగా టీడీపీతో రమేష్ ఆస్పత్రి యాజమాన్యానికి ఉన్న సంబంధాలను కూడా ప్రశ్నించడం మొదలుపెడితే మొత్తంగా దర్యాప్తే పక్కదోవ పట్టే అవకాశముంది. కాబట్టి వైసీపీ సర్కారు నిష్పాక్షికంగా దర్యాప్తు పూర్తి చేయడం ద్వారా రాజకీయ విమర్శలకు తావివ్వకుండా చూసుకోవచ్చనే వాదన వినిపిస్తోంది.