ఏపీ రాజధాని అమరావతి మార్పుపై కేంద్రం జోక్యం చేసుకుంటుందా ? భిన్నవాదనలు
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమంటూ, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని చేసిన ప్రకటన ఏపీలో రాజకీయ దుమారం రేపింది. దానికి తగ్గట్టు జిఎన్ రావు కమిటీ నివేదిక కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు తగ్గట్టుగా ఉండటం ఏపీ రాజధాని అమరావతిని డోలాయమాన పరిస్థితిలో పడేసింది. ఇక దీనిపై రాజధాని ప్రాంత రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పట్టారు.
ఆంధ్రప్రదేశ్ కు ఆది నుండీ రాజధాని కష్టాలే .. శాశ్వత రాజధానే లేని ఏపీ ప్రస్థానం ఇదే !!
ఢిల్లీ వెళ్లి మరీ పోరాటం చేస్తామంటున్న రాజధాని రైతులు
నేటికీ ఏపీలో ఆగ్రహజ్వాలలు మిన్నంటుతూనే ఉన్నాయి. అధికారం మారినంత మాత్రాన, రాజధాని మార్చాలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు ఢిల్లీ వరకు వీలైన పోరాటం చేస్తామని, కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకు వెళ్తామని తేల్చి చెప్తున్నారు. అయితే ఏపీ రాజధాని వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందా ? రాజధాని వ్యవహారం రాష్ట్రాల సొంత నిర్ణయమని భావిస్తున్న నేపథ్యంలో నెలకొన్న తాజా పరిస్థితులపై కేంద్ర ఏమైనా చేయగలుగుతుందా అన్న చర్చ ఏపీలో ప్రధానంగా సాగుతుంది.
ప్రధాని నరేంద్ర మోడీ ఈ వ్యవహారంపై స్పందిస్తారా ?
ఏపీ సీఎం జగన్ రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమంటూ అసెంబ్లీలో చేసిన ప్రకటనను టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే తాజాగా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని మోడీని కోరేందుకు ఢిల్లీకి రాజధాని రైతులు వెళుతున్నారన్న వార్తల నేపథ్యంలో కేంద్ర ఈ విషయంలో జోక్యం చేసుకుంటుందా? ప్రధాని నరేంద్ర మోడీ దీనిపై స్పందిస్తారా? అన్నది ప్రశ్నగా మారింది. అమరావతిలోనే రాజధాని ఉండేలా చూడాలని డిమాండ్ చేస్తున్న రైతులు తమ పరిస్థితిని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.
రైతులకు మద్దతుగా సుజనా.. కేంద్రం చూస్తూ ఊరుకోదని వ్యాఖ్య
రైతులకు మద్దతుగా బీజేపీ ఎంపీ సుజనా చౌదరి కూడా మాట్లాడారు. ‘అమరావతిని మార్చడం సులభం కాదు.. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మారదని, వైసీపీ ప్రభుత్వం ఇష్టమొచ్చినట్టు మారిస్తే కేంద్రంలోని బీజేపీ మౌనంగా ఉండదు అంటూ సుజనా చౌదరి ట్వీట్ చేశారు. మరి సుజనా చౌదరి ట్వీట్ వెనుక ఆంతర్యమేమిటో సుజన కే తెలియాలి. అయితే ఇదే విషయంపై స్పందించిన బీజేపీ మరో సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు రాజధాని నిర్మాణం వికేంద్రీకరణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయమని, ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు.
రాజధాని అంశం పూర్తిగా రాష్ట్రం నిర్ణయం అన్న జీవీఎల్
సుజనా చౌదరి రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుంది అంటే, జీవీఎల్ నరసింహారావు మాత్రం కేంద్రానికి సంబంధం లేదు జోక్యం చేసుకోదు అంటూ వ్యాఖ్యలు చేయడం రాష్ట్రం తీసుకున్న నిర్ణయంపై, అసలు కేంద్రం వైఖరి ఏంటి అన్న అంశానికి ప్రాధాన్యతనిస్తుంది. మూడు రాజధానుల వివాదంపై ఏపీ లోని అధికార పార్టీ కూడా తనదైన శైలిలో స్పందన తెలియజేస్తోంది.అమరావతిని చంద్రబాబు తాత్కాలిక రాజధాని మాత్రమే అన్నారని, తాము కూడా తాత్కాలిక రాజధానిగానే భావిస్తున్నామని సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. మూడు రాజధానులు కాకుంటే ఏకంగా 30 రాజధానులు పెట్టుకుంటామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం మారితే రాజధానులు మార్చుకోవచ్చా అన్న చర్చ
ప్రభుత్వం మారినప్పుడల్లా ఎవరి ఇష్టారాజ్యం వారు రాజధానులు మార్చుకోవచ్చా అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరించాల్సిన అవసరం ఉన్న నేపధ్యంలో ఏపీ సర్కార్ కు కేంద్రం సూచన చెయ్యటానికి అవకాశం ఉంది అన్న చర్చ కూడా సాగుతుంది. మరి ఇంతకీ రాజధాని రైతులు ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్తామని చెబుతున్న నేపథ్యంలో ఈ విషయంలో మోడీ ఎలా స్పందిస్తాడన్నది ఆసక్తిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తామేమీ చేయలేమని చేతులెత్తేస్తారా లేక సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ప్రతికూల వైఖరిని తెలియజేస్తారా అన్నది తేలాల్సి ఉంది.