విషాదం : కరోనాను జయించినా.. ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య...
విజయవాడలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రి భవనం పైనుంచి దూకి ఓ కరోనా బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడింది. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయినప్పటికీ... ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించడంతో... తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలిని చల్లపల్లి మండలం నారాయణపురానికి చెందిన ఆదిలక్ష్మిగా ఆసుపత్రి సిబ్బంది గుర్తించారు. కరోనా బాధితుల పట్ల వివక్ష తగదని ప్రభుత్వాలు,అధికారులు ఎంతలా ప్రచారం చేస్తున్నా.. కుటుంబ సభ్యుల నుంచే వారికి మద్దతు కరువవడం ఆందోళన కలిగించే అంశం.
మరో ఘటనలో ఓ వృద్దుడురు విజయవాడ ప్రకాశం బ్యారేజ్పై ఆత్మహత్యకు యత్నించాడు. కుమారుడికి కరోనా సోకడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే అక్కడే ఉన్న ఎన్డీఆర్ఎఫ్ పోలీసులు వెంటనే అప్రమత్తమై అతన్ని కాపాడినట్లు తెలుస్తోంది. బాధితుడిని మచిలీపట్నానికి చెందిన నాగేశ్వరరావుగా గుర్తించారు. ప్రస్తుతం అతను జీజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు.
Recommended Video
మరోవైపు రాష్ట్రంలో వరుసగా మూడో రోజు 10వేల పైచిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 10,376 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మరో 68 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,40,933కి చేరింది. ఇప్పటివరకూ మొత్తం 1349 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటివరకూ 63,864 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అవగా.. ప్రస్తుతం 75,720 మంది యాక్టివ్ కేసులున్నాయి.