విజయవాడలో ఉద్రిక్తత: అమరావతి మహిళా రైతుల మెరుపు ధర్నా: ఎఎంఆర్డీఎ ముట్టడికి యత్నం
విజయవాడ: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలను నిరసిస్తూ 250 రోజులకు పైగా ఆందోళనలను చేపడుతూ వచ్చిన అమరావతి ప్రాంత రైతులు.. బుధవారం అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. కౌలు మొత్తాన్ని చెల్లించాలంటూ మెరుపు ధర్నాకు దిగారు. విజయవాడలోని అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి అథారిటీ (ఏఎంఆర్డీఏ) కార్యాలయాన్ని ముట్టడించడానికి బయలుదేరగా.. పోలీసులు వారిని వెంకటాయపాలెం చెక్పోస్ట్ వద్ద అడ్డుకున్నారు.
పోలీసులు వారిని అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ తదితరులు ఈ ఆందోళనల్లో భాగస్వామ్యులు అయ్యారు. ఈ ఉదయం పెద్ద సంఖ్యలో అమరావతి మెట్రోపాలిటన్ కార్యాలయానికి చేరుకోవడానికి బయలుదేరి వెళ్లారు. వెంకటాయపాలెం చెక్పోస్ట్ వద్ద పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వుయ్ వాంట్ జస్టిస్ అంటూ నిరసన గళాన్ని వినిపించారు. లోనికి దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీనితో ఇద్దరి మధ్య తోపులాట చోటు చేసుకుంది. తమను లోనికి వెళ్లనివ్వాలని, ప్రభుత్వం తమను అన్యాయానికి గురి చేస్తోందంటూ అమరావతి రైతులు వాపోయారు. ప్రభుత్వం తమకు ఇస్తామన్న కౌలుమొత్తాన్ని చెల్లించట్లేదని అన్నారు.
విజయవాడలో ఉద్రిక్తత: అమరావతి మహిళా రైతుల మెరుపు ధర్నా: ఎఎంఆర్డీఎ ముట్టడికి యత్నం#Amaravati #Vijayawada #AMRDA pic.twitter.com/sxftkKsokd
— oneindiatelugu (@oneindiatelugu) August 26, 2020
రాజధాని అమరావతి నిర్మాణానికి తాము వేలాది ఎకరాలను ఉచితంగా ప్రభుత్వానికి అప్పగించామని, తీరా ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో ప్రభుత్వం తమ పొట్టకొడుతోందని మండిపడ్డారు. కౌలు మొత్తాన్ని చెల్లించకపోవడం వల్ల తాము ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తాము 250 రోజులకు పైగా ఆందోళనలను చేపడుతున్నప్పటికీ.. ప్రభుత్వం తమను చర్చకు పిలవలేదని, కనీసం ఆ ప్రయత్నం కూడా చేయలేదని విమర్శించారు.
అమరావతి నుంచి అంగుళం భూమిని కూడా కదలనివ్వబోమని హెచ్చరించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కౌలు మొత్తాన్ని యధాతథంగా చెల్లించాలని, దాన్ని నిలిపి వేయడం చట్టవ్యతిరేకమని ధ్వజమెత్తారు. పెద్ద సంఖ్యలో రైతులు.. కార్యాలయం లోనికి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించగా. పోలీసులు వారిని అడ్డుకున్నారు. అరెస్టు చేసి.. ప్రత్యేక వాహనాల్లో తరలించారు.