నగ్నంగా పూజలు చేస్తేనే సినీస్టార్ అవుతారు, యువతికి దొంగ బాబా కహానీ, రూ.18 లక్షలు వసూల్
దొంగ బాబాలు కొత్త పుంతలు తొక్కుతున్నారు. అమాయకుల బలహీనతే పెట్టుబడిగా రెచ్చిపోతున్నారు. ముక్కుపిండీ డబ్బులు వసూల్ చేయడమే కాదు.. నగ్నంగా పూజలు చేయాలని కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు. విజయవాడ నడిబొడ్డున గల భవానీపురంలో రాత్రికి రాత్రే దొంగబాబా అచ్చిరెడ్డి వెలిశాడు. తన ఇంటి వద్దే కార్యాలయం ఏర్పాటు చేసి.. అమాయకులకు వల వేస్తున్నాడు. అతనివలలో చిక్కిన ఓ యువతి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
దొంగ బాబా..
విజయవాడ భవానీపురంలో అచ్చిరెడ్డి అలియాస్ బాబా ఉంటున్నాడు. తన ఇంటి వద్దే కార్యాలయం ఏర్పాటు చేశాడు. అదీ సాదసీదా ఆఫీసు కాదు అమాయకులను బురిడీ కొట్టించే దొంగ బాబా కార్యాలయం.. ఇలా అచ్చిరెడ్డి వలలో ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువతి చిక్కింది. ఆమెను మాటల్లో పెట్టిన అచ్చిరెడ్డి.. తొలుత రూ. లక్ష వసూల్ చేశాడు. తర్వాత దైవభక్తికి సంబంధించిన యూ ట్యూబ్ చానెల్ ఉందని... అందులో షేర్ ఇస్తానని నమ్మబలికాడు. ఒకటి కాదు రెండు కాదు రూ. 18 లక్షలు గుంజాడు.
నగ్నంగా పూజలు..
తర్వాత కూడా యువతికి మాయమాటలు చెప్పేవాడు. యూ ట్యూబ్ షేర్ దేవుడికి ఏరుగు... కొత్తగా సినిమా అవకాశాలు ఇప్పిస్తానని మొదలుపెట్టాడు. అయితే అందుకోసం నగదు కాకుండా.. నగ్నంగా పూజలు చేయాలని చెప్పాడు. దీంతో యువతి విస్తుపోయింది. అప్పటికీ గానీ యువతికి అచ్చిరెడ్డి వ్యవహారం తెలియలేదు. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. భవానీపురం పోలీసుస్టేషన్లో దొంగబాబాపై కేసు ఫైల్ చేసింది. యువతి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఫేక్ బాబా అచ్చిరెడ్డి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
Recommended Video
ఒక్కరు కాదు..
కేసు నమోదు చేశాక అచ్చిరెడ్డి లీలలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడలోనే కాకుండా పరిసర ప్రాంతాల యువతులకు కూడా గాలం వేశాడని పోలీసులు పేర్కొన్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ అచ్చిరెడ్డి బాధితులు ఉన్నారని చెప్పారు. బాధితులందరి తరఫున కేసు నమోదు చేశామని.. త్వరలోనే నిందితుడిని పట్టుకొంటామని పోలీసులు చెప్తున్నారు. తనలా మరొకరు మోస పోకూడదని.. బాబాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లాకు చెందిన యువతి పోలీసులను కోరారు.