డీజీపీకి వైసీపీ..టీడీపీ పోటాపోటీ ఫిర్యాదులు: జగన్ పైనా ఇలా..చంద్రబాబు విషయం మరిచిన తమ్ముళ్లు.
డీజీపీ గౌతం సవాతంగ్కు వైసీపీ..టీడీపీ నేతలు పోటా పోటీగా ఫిర్యాదులు చేసారు. సోషల్ మీడియాలో సీఎం.. హోం మంత్రిపై దుష్ప్రచారం చేస్తూ.. అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని.. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆళ్ళ డీజీపీకి ఫిర్యాదు చేశారు. అదే విధంగా..టీడీపీ నేతలు సైతం ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయన్నారు. ఆరుగురు టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని ఫిర్యాదు చేసారు. కానీ, తమ అధినేతకు సంబంధించిన కీలక అంశాన్ని మాత్రం పార్టీ నేతలు విస్మరించారు.
చంద్రబాబు టార్గెట్ గా కేంద్రం అడుగులు .. పోలవరంపై పెంటపాటికి లేఖ
జగన్పైన సోషల్ మీడియాలో ఇలా..
వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డీజీపీ గౌతం సవాంగ్ను కలిసారు. టీడీపీ తన కిరాయి మనుషులతో వైఎస్సార్ సీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతోందని, వీటిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ వ్యూహాత్మకంగా దాడులు చేసి,..వాటిని వైఎస్సార్ సీపీపై నెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. సోషల్ మీడియాలోనూ సీఎం, హోంమంత్రిపై దుష్ప్రచారం చేస్తూ.. అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని తెలిపారు. అలాంటి వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆళ్ళ డీజీపీకి ఫిర్యాదు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే టీడీపీ ఇటువంటి అరాచకాలకు పాల్పడుతోందన్నారు. లోకేష్ ఓటమిపై ఆత్మ పరిశీలన చేసుకోకుండా తమపై అక్కసుతో వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కే ఫైర్ అయ్యారు.
ఆరుగురు కార్యకర్తలను హత్య చేసారు..
ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయాని టీడీపీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేసారు. ఆరు గురు టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల రోజుల కాలంలో టీడీపీ నేతలు.. కార్యకర్తల పైన మొత్తం 130 దాడులు జరిగాయని వివరించారు. కార్యకర్తలపై 80 భౌతిక దాడులు జరగ్గా.... 54 చోట్ల ఆస్తులను ధ్వంసం చేశారని డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని నేతలు ఆరో పించారు. దీని కోసమేనే ప్రజలు అధికారం అప్పగించింది అని టీడీపీ నేతలు సోమిరెడ్డి..చినరాజప్ప ప్రశ్నించారు. ప్రతీ ఒక్కరికి భద్రత కల్పించలేమంటూ హోం మంత్రి సుచరిత చేసిన వ్యాఖ్యలను పార్టీ నేత వర్ల రామయ్య తప్పు బట్టారు.వైసీపీ నేతలకు మద్దతుగా కాకుండా..పోలింగ్ను సమర్ధవంతంగా వినియోగించాలని కోరారు.
చంద్రబాబు విషయం మరిచారా..
టీడీపీ నేతలు డీజీపీని కలిసి పార్టీ కార్యకర్తల పైన దాడుల గురించి ప్రస్తావించారు. చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు. అయితే, తమ పార్టీ అధినేతకు కక్ష్య పూరితంగా భద్రత తొలిగించారని నాలుగు రోజులుగా ఆరోపిస్తన్న పార్టీ నేతలు ఆ విషయం డీజీపీ వద్ద ప్రస్తావించ లేదు. అయితే, మీడియాతో మాట్లాడిన డీజీపీ తాము ప్రతిపక్ష నేతగా ఏ స్కేల్ ప్రకారం భద్రత ఇవ్వాలో అంత కంటే ఎక్కువగానే ఇస్తున్నామని..చంద్రబాబుకు భద్రత తొలిగించామనే ఆరోపణలు సరి కాదన్నారు. అయితే ఫిర్యాదుల విషయంలోనూ అధికార ప్రతిపక్ష పార్టీలు పోటీ పడి మరీ ఫిర్యాదులు చేస్తున్నాయి. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కంటే ముందుగానే డీజీపీ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయటం..అందునా ఒక్క ఎమ్మెల్యే మాత్రమే సింగిల్గా వెళ్లి ఫిర్యాదు ఇవ్వటం ఇప్పుడు చర్చ నీయాంశంగా మారింది.