వైసీపీ ఎంపీపై రేప్ కేసు ఉంది..ఇదిగో ఆధారం: సభలో చంద్రబాబు: అధికారపక్షం అభ్యంతరం!
ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు సంచలన ఆరోపణలు చేసారు. వైసీపీకి చెందిన హిందూపూరం ఎంపీ మీద రేపు కేసు ఉందని ఆరోపించారు. శాసనసభలో ఏపీలో మహిళా భద్రతకు సంబంధించిన చర్చలో భాగంగా..ఈ ఆరు నెలల కాలంలో ఏపీలో మహిళల పైన జరిగిన ఘటనలను చంద్రబాబు సభ ముందుంచారు. జిల్లాల వారీగా చోటు చేసుకున్న అంశాలను వివరించారు. అదే సమయంలో సొంత పార్టీ నేతలను ముఖ్యమంత్రి నియంత్రించాలని సూచించారు. ప్రకాశం..అనంతపురం జిల్లాల్లో జరిగిన అంశాలను ప్రస్తావించారు. అదే సమయంలో..వైసీపీ హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ పైన రేపు కేసు ఉందని.. దీనికి సంబంధించిన కేసు నెంబర్ అంటూ..చెప్పుకొచ్చారు. దీని పైన వైసీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేసారు.
నాకు ఒక్క భార్యే: కొందరికి ముగ్గురు కూడా సరిపోక: శాసనసభలో జగన్ పంచ్ లు..!
మీ ఎంపీ పైనే రేపు కేసు ఉంది...
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అనేక మంది అధికార పార్టీ నేతలు మహిళల మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. సభలో తేదీలు..ప్రదేశాల వారీగా నేతల పేర్లు చెప్పి మరీ ఎక్కడ ఏం ఘటన జరిగిందీ వివరించారు. మీ సొంత పార్టీ ఎంపీ మీద రేపు కేసు ఉందని..కోర్టులో ఈ కేసు ఉందని గట్టిగా చెప్పారు. దీని మీద జాతీయ మీడియాలో సైతం చర్చ సాగుతోందని వివరించారు. దీని పైన వైసీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఆ విషయాలు తరువాత మాట్లాడుదామని..ముందు మహిళా భద్రత పైన సూచనలు చేయాలని పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సూచించారు. దీంతో.. మరోసారి చంద్రబాబు కేసు నెంబర్ తో సహా ప్రస్తావిస్తూ ఆయన మీద ఉన్న కేసు గురించి వివరించే ప్రయత్నం చేయగా..స్పీకర్ వారించారు.
మీ నేతలను నియంత్రించండి...
రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉందని..ముందుగా పార్టీ నేతలను కంట్రోల్ చేయాలని చంద్రబాబు సూచించారు. ఒంగోలు..అనంతపురం..తూర్పు గోదావరి జిల్లాల్లో వైసీపీ నేతలు చేసిన అఘాయిత్యాలను చంద్రబాబు ప్రస్తావించారు. అయితే, దీని పైన ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. చంద్రబాబు చెప్పిన అంశాలు వారికి మద్దతుగా నిలిచే పత్రికల్లో వచ్చిన కధనాలుగా కొట్టి పారేసారు. ఇక, మహిళల భద్రత విషయంలో తమ ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలతో పాటుగా..తీసుకోనున్న అంశాలను ముఖ్యమంత్రి వివరించారు. కొందరు బాధితులు స్వయంగా తన వద్దకు వచ్చి ఆవేదన వ్యక్తం చేసారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
హెరిటేజ్ మీద చర్చ..
ముఖ్యమంత్రి జగన్ ఉల్లి ధరల మీద ప్రకటన సమయంలో దేశంలో ఏపీ ప్రభుత్వం ఒక్కటే కిలో ఉల్లి రూ 25కి అందిస్తోందని..రైతు బజార్ల ద్వారా సబ్సిడీ ధరలకే అందిస్తున్నామని వివరించారు. దీని పైన ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందని స్పష్టం చేసారు. ఉల్లి ధరల పైన ఆందోళన చెందుతున్న చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ కిలో ఉల్లి రూ 200గా ఉందని జగన్ వ్యాఖ్యానించారు. దీనిని చంద్రబాబు ఖండించారు, హెరిటేజ్ ఫ్రెష్ ఇప్పుడు తమ ఆధీనంలో లేదని చెప్పారు. ఇంతో మీ వద్ద హెరిటేజ్ లేకపోతే..తమకు స్వీట్లు ఎలా పంపారంటూ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణీ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా చంద్రబాబు అది హెరిటేజ్ ఫుడ్స్ అని చెబుతూ..రెండింటికి తేడా తెలుసుకోవాలని సూచించారు. అసలు సభలో హెరిటేజ్ విషయం ఎందుకని..తాను ప్రశ్నించాలంటే జగన్ సంస్థల గురించి మాట్లాడలేనా అని చంద్రబాబు నిలదీసారు.