సీఎం జగన్ ఆదేశాలు బేఖాతర్..! పట్టించుకోని ఎంపీలు: వారి రూటు మారుతోందా..!
ఏపీ ముఖ్యమంత్రి..వైసీపీ అధినేత జగన్ ఆదేశాలను సొంత పార్టీ ఎంపీలే అమలు చేయటం లేదు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు పార్టీ ఎంపీలతో సీఎం సమావేశమయ్యారు. ఆ సమయంలో వారికి కొన్ని స్పష్టమైన సూచనలు చేసారు. పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి.. లోక్ సభలో పార్టీ నేత మిథున్ రెడ్డితో కలిసే ప్రధాని లేదా కేంద్రమంత్రుల నైనా కలవాలని సూచించారు.ఆ సమయంలో కొందరు ఎంపీలు వ్యక్తిగతంగా వెళ్లి కలవద్దని..సమిష్టిగా నడుచుకోవాలని తేల్చి చెప్పారు. ఆ తరువాత ఎంపీ రఘురామరాజు వ్యవహారం దుమారం రేపింది. అయితే, పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో నే వైసీపీ ఎంపీలు అధినేత ఆదేశాలకు భిన్నంగా ప్రధాని..కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. అసలు వైసీపీ ఎంపీల ఆలోచనలోనే మార్పు వచ్చిందా.. వారి రూటు మారిందా అనే చర్చ పార్టీలో జరుగుతోంది.
ఏపీలో రౌడీ రాజ్యం..: కేంద్ర హోం మంత్రికి టీడీపీ ఫిర్యాదు: జగన్ పాలనపైన అమిత్ షా స్పందనతో...!
ప్రధానితో ఎంపీ మాగుంట భేటీ
ఎన్నికల ముందు టీడీపీ నుండి వైసీపీలో చేరి ఒంగోలు ఎంపీగా గెలిచిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి ప్రధానితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రధానితో మాగంట భేటీ సమయంలో ఆయన పక్కన ముఖ్యమంత్రి సూచించినట్లుగా విజయ సాయిరెడ్డి..మిథున్ రెడ్డి ఎవరూ లేరు. ఆయన ముందుగానే ప్రధాని అప్పాయింట్ మెంట్ కోరినట్లుగా తెలుస్తోంది. కేవలం మర్యాద పూర్వకంగానే తాను ప్రధానిని కలిసానని..జిల్లాలో డెవలప్ మెంట్ కార్యక్రమాల గురించి చర్చించానని మాగుంట చెబుతున్నారు. అయితే, ఆయన టీడీపీలో ఉన్న సమయంలో ఎన్నికల ముందు చెన్నైలో ఆయన వ్యాపార సంస్థల మీద ఐటీ దాడులు జరిగాయి. తొలి నుండి పారిశ్రామిక వేత్త అయిన మాగుంట కాంగ్రెస్ హాయంలోనూ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సత్సంబంధాలు కొనసాగించే వారు. అయితే, వైసీపీ ఎంపీ అయిన తరువాత కూడా అదే రకంగా సంబంధాల కసం ప్రయత్నిస్తున్నారు. ఇది పార్టీలో కొత్త చర్చకు కారణమైంది.
కేంద్ర మంత్రితో రఘురామరాజు
ఇక, కొద్ది రోజుల క్రితం వైసీపీలో చర్చకు కారణమైన నర్సాపురం ఎంపీ రఘురామ రాజు బీజేపీ నేతలను ఎవరిని కలిసినా..వైసీపీలో వెంటనే చర్చ జరుగుతోంది. రెండు రోజుల క్రితం పార్లమెంట్ ప్రాంగంలోని బీజేపీ పార్టీ కార్యాలయానికి రఘురామ రాజు వెళ్లటం పైన రక రకాల చర్చలు సాగాయి. ఇక, గత వారం ముఖ్యమంత్రిని కలిసి తన మీద జరుగుతున్న ప్రచారానికి సంబంధించి వివరణ ఇచ్చారు. తనకు బీజేపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయని..ప్రధానితో ఎప్పటి నుండో పరిచయం ఉందని చెప్పుకొచ్చారు. ఆయన తాజాగా రూరల్ డెవలప్ మెంట్ శాఖా మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తో సమావేశమయ్యారు. నిధుల కేటాయింపుకు సంబంధించి కలిసినట్లుగా చెబుతున్నారు. అయితే, సీఎం రాష్ట్ర సమస్యల పైన ఎంపీలు టీంలుగా ఏర్పడి కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లాలని సూచించినా...పార్లమెంట్ సమావేశాల సమయం లో మాత్రం అది అమలు కావటం లేదు.
ఆ ఇద్దరు ఎంపీలు అదే విధంగా..
ఇక, విశాఖ..విజయనగరంకు చెందిన ఎంపీలు సైతం విడివిడిగానే కేంద్ర మంత్రులను కలిసారు. రైల్వే డివిజన్ గురించి విశాఖ ఎంపీ సత్యనారాయణ రైల్వే శాఖ సహాయ మంత్రితో..పాకిస్థాన్ కోస్టు గార్డులు నిర్బంధించిన జాలర్ల సమస్య పైన బెల్లాన చంద్రశేఖర్ విదేశాంగ శాఖా మంత్రి జైశంకర్ తో సమావేవమయ్యారు. అయితే, జాలర్ల సమస్య శ్రీకాకుళం..విజయనరగం..ఉభయ గోదావరి జిల్లాలకు కూడా సంబంధించి అంశం అయినా..ఆ జిల్లాల ఎంపీలు మాత్రం కలిసి రాలేదు. ఇలా..ఎంపీలు సమస్యలను కేంద్ర మంత్రులకు వివరిస్తున్నామని చెబుతున్నా..సీఎం చెప్పిన ఆదేశాలు ఎందుకు అమలు చేయటం లేదనేది ఇప్పుడు పార్టీలో చర్చ. తాజాగా వైసీపీ ఎంపీలు సైతం బీజేపీతో టచ్ లో ఉన్నారంటూ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యల పైన వైసీపీ ఎంపీలు తీవ్రంగా స్పందించారు. మరి..ఇప్పుడు ఎంపీలు ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు పైన సీఎం ఎలా స్పందిస్తారో చూడాలి.