సీఎం జగన్ పై హిందూ వ్యతిరేక ముద్ర కోసం.. రమేష్ బీజేపీలో పచ్చ కోవర్ట్ :బీజేపీ పై అంబటి ఫైర్..!!
వైసీపీ తొలి సారిగా బీజేపీని లక్ష్యంగా చేసుకొని ఫైర్ అయింది. వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు బీజేపీ నేతల పైన విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు తో సహా.. బీజేపీ నేత మాజీ మంత్రి మాణిక్యాల రావు పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. వరదల్లో ఇల్లు మునిగి పోతుందని తెలిసే చంద్రబాబు హైదరాబాద్ పారిపోయారని ఎద్దేవా చేసారు. ముఖ్యమంత్రి జగన్ హిందూ వ్యతిరేకి అంటూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారం పైన అంబటి సీరియస్ అయ్యారు. ఏపీలో కమల వనం ఇప్పుడు పచ్చ వనంగా మారుతోందని ఆరోపించారు. సీఎం రమేష్ బీజేపీలో ఉన్న పచ్చ కోవర్ట్ అని మండిపడ్డారు. ఇటువంటి వారితో బీజేపీ నేతలు జాగ్రత్తగా ఉండాలంటూ రాంబాబు సూచించారు.
చంద్రబాబు..చెయ్యినొప్పీ..హైదరాబాద్
వరదల్లో ఇల్లు మునిగి పోతుందని తెలిసే చంద్రబాబు హైదరాబాద్ పారిపోయారని వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేసారు. నాగార్జునసాగర్ గేట్లు మూసేసిన తర్వాతనే విజయవాడకు తిరిగొచ్చారని చెప్పకొచ్చారు. బాబు ధోరణి చూస్తుంటే వరదలతోనూ సానుభూతి పొందాలన్నట్టుగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చెయ్యి నొప్పి కారణంగానే తాను హైదరాబాద్ వెళ్లినట్లు చెబుతున్నారని.. చెయ్యి నొప్పికి హైదరాబాద్ దాకా వెళ్లాలా..ఇక్కడ డాక్టర్లు లేరా అని రాంబాబు ప్రశ్నించారు. బాబు హైదరాబాద్ వెళితే మరి లోకేష్ ఎక్కడికి వెళ్లారంటూ అంబటి నిలదీసారు. వెళ్లారు. నదీగర్భంలో ఉంటూ ఇల్లు ముంచేశారంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారని... పేపర్లలో రాయించుకుంటున్నారుని రాంబాబు ఆరోపించారు. కృష్ణా నదికి వరదలు సృష్టించడం మానవులకు సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని టీడీపీ హయాంలో దేవినేని ఉమా ప్రకటించారు కదా...మరేమైందంటూ అంబటి రాంబాబు నిలదీసారు. ఏ అక్రమ కట్టడానికైతే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నోటీసులు ఇస్తామన్నారో.. ఇప్పుడు అదే ఇంట్లో చంద్రబాబు ఉన్నారంటూ అంబటి ఫైర్ అయ్యారు.
జగన్ పైన హిందూ వ్యతిరేక ముద్ర కోసం..
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పైన హిందూ వ్యతిరేక ముద్ర వేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అంబటి ఆందోళన వ్యక్తం చేసారు. మెరికాలో జ్యోతి ప్రజ్వలన చేయలేదని సీఎం జగన్మోహన్రెడ్డిని హిందూ వ్యతిరేకి అంటూన్నారని.. వాస్తవాలు తెలుసుకోకుండా అసత్యాలు మాట్లాడ్డం నేరమని చెప్పుకొచ్చారు. అక్కడ ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా జ్యోతిని వెలిగిస్తారని వివరిస్తూ..సీఎం అదే చేసారని చెప్పారు. కమల వనంలో చేరిన పచ్చ పుష్పాలు సీఎం జగన్పై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.. సీఎం రమేష్ బీజేపీలో ఉన్న పచ్చ కోవర్టని ఆరోపించారు. విజయవాడ నడిబొడ్డున దేవాలయాలను చంద్రబాబు కూలగొట్టించినపుడు బీజేపీ నేత మాణిక్యాలరావు ఏమయ్యారని నిలదీసారు. సదావర్తి భూములను అన్యాయంగా వేలం పాట వేస్తే మాణిక్యాలరావు గుడ్లగూబలా చూస్తూ ఉండిపోయారంటూ మండిపడ్డారు. పచ్చ రక్తంతో బీజేపీ తన సహజత్వం కోల్పోతుందని... ఆంద్రప్రదేశ్లో కమల వనం కాస్తా పచ్చ వనంగా మారుతుందని హెచ్చరించారు. బీజేపీ నేతలు జాగ్రత్తగా ఉండాలని..సమయం వచ్చినప్పుడు వాళ్లంతా తిరిగి చంద్రబాబు పక్కనే చేరతారని బీజేపీకి రాంబాబు హితవు పలికారు.
కోడెలను వదలని రాంబాబు..
కోడెల శివ ప్రసాద్ స్థాయి దిగజారి పోయారంటూ రాంబాబు ఫైర్ అయ్యారు. ఆయన అసెంబ్లీని దేవాలయమని..తాను పూజారి అని చెబుతున్నారని ఆయన అదే గుడిలోని కొబ్బరి చిప్పలను కూడా దొంగిలించారని ఆరోపించారు. అమరావతి..పోలవరం పైన ప్రభుత్వానికి స్పష్టత ఉందని చెబుతూనే.. అన్ని వాస్తవాలు ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేసారు. టీడీపీ హాయంలో జరిగిన అవినీతిని బయట పెడతామని తేల్చి చెప్పారు. రాజధాని మారుస్తామని మంత్రి బొత్సా ఎక్కడైనా చెప్పారా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.