రాజకీయ కక్షలతో రగులుతున్న ఏపీ...! రెచ్చిపోయిన వైసీపీ.. మూడు చోట్ల టీడీపీ శ్రేణులపై దాడులు..!
విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ దండు రెచ్చిపోయింది. మూడు చోట్ల దాడులకు తెగబడింది. టీడీపీ శ్రేణులే టార్గెట్గా కొట్లాటకు తెర లేపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మూడు ఘటనల్లో దాదాపు 17 మంది గాయపడటం గమనార్హం. అదలావుంటే ఏపీలో కొత్తగా ప్రభుత్వ పగ్గాలు చేపట్టాక ఇలాంటి దాడులు నిత్యకృత్యంగా మారుతున్నాయనే వాదనలు జోరందుకున్నాయి.
టీడీపీ వర్సెస్ వైసీపీ చందంగా ఏపీలో రాజకీయ కక్షలు భగ్గుమంటున్నాయి. అటు చంద్రబాబు లక్ష్యంగా సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అదే క్రమంలో టీడీపీ కార్యకర్తలను సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
టీడీపీ వర్సెస్ వైసీపీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు యూ టర్న్ తీసుకున్నాయి. టీడీపీ అధికారం కోల్పోయి వైసీపీ ప్రభుత్వం ఫామ్లోకి వచ్చింది. ఆ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్, అనుచరులు, మద్దతుదారులే లక్ష్యంగా వైసీపీ కక్షసాధింపు చర్యలు ఊపందుకున్నాయనే ఆరోపణలు జోరందుకున్నాయి. ఆ మేరకు టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఆ క్రమంలో తాజాగా మూడు చోట్ల వైసీపీ కార్యకర్తలు దాడులకు తెగబడటం హాట్ టాపిక్ అయింది.
రేణిగుంటలో లొల్లి ముదిరిందిలా..! లేచిన కర్రలు, కత్తులు
చిత్తూరు జిల్లా రేణిగుంటలో శనివారం రాత్రి టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది. స్వయం సహాయక సంఘంలో సభ్యులను చేర్చుకునే విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన వాగ్వాదం తోపులాటకు దారితీసింది. అది కాస్తా ముదిరి ఆదివారం ఉదయం టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కర్రలు, కత్తులు చేతబట్టి వీరంగం సృష్టించారు.
ఈ ఘటనలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అయితే వారు కూడా ఎదురుదాడికి దిగడంతో నలుగురు వైసీపీ కార్యకర్తలు గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడ్డవారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఏపీలో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా పోయినట్లేనా.. బీజేపీ కన్నేసిందా.. ముహుర్తం ఎప్పుడంటే..!
ప.గో లోనూ అటాక్.. నీటి కుళాయి దగ్గర గొడవ
పశ్చిమగోదావరి జిల్లాలోనూ వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పెదవేగి మండలం అంకన్నగూడెంలో టీడీపీ సానుభూతి పరులపై అటాక్ చేశారు. ఈ ఘటనలో టీడీపీ సానుభూతిపరులైన విద్యాధరరావు, ఆయన భార్య మీనా గాయపడ్డారు. పంచాయతీ కుళాయి దగ్గర జరిగిన పంచాయితీ ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది.
నీళ్లు పట్టుకునే క్రమంలో వైసీపీ వర్గీయులు తమను దూషించడమే గాకుండా దాడి చేశారని ఆ దంపతులు వాపోయారు. అయితే మాజీ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రావుపై తాము అభిమానం చూపించడం వల్లే వైసీపీ కార్యకర్తలు పగ పెంచుకున్నట్లు ఆరోపించారు. చింతమనేని ఓడిపోయిన దగ్గర్నుంచి తమను వేధిస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లాలో సైకిల్ వర్సెస్ ఫ్యాన్
గుంటూరు జిల్లాలో కూడా వైసీపీ వర్గాలు దాడులకు దిగిన ఘటన వెలుగుచూసింది. ఫిరంగిపురం మండలం నుదురుపాడులో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో ఆరుగురు గాయాలపాలయ్యారు. వారిని నర్సరావుపేట ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు ధృవీకరించారు. అయితే ఇరువర్గాల గొడవకు సంబంధించి పోలీస్ అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేసి మరోసారి దాడులు జరగకుండా చర్యలు తీసుకున్నారు.