year ender 2020 : ఈ ఏడాది దారుణాల్లో టాప్- విజయవాడ కోవిడ్ సెంటర్ అగ్నిప్రమాదం
ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న ప్రమాదాల జాబితాలో విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్లో జరిగిన దారుణ అగ్ని ప్రమాదం టాప్లో నిలిచింది. నగరంలో ప్రముఖ ఆస్పత్రుల్లో ఒకటైన రమేష్ కార్డియాక్ సెంటర్ స్వర్ణప్యాలెస్ను లీజుకు తీసుకుని నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్లో జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది కరోనా రోగులు సజీవ దహనమైపోయారు. ఆ తర్వాత దీనిపై భిన్న వాదనలు వినిపించినా అంతిమంగా రమేష్ ఆస్పత్రి తగిన చర్యలు తీసుకోకపోవడమే కారణంగా ప్రభుత్వం నిర్ధారించింది. దీంతో ఈ దిశగా దర్యాప్తు కూడా కొనసాగిస్తోంది. ఇది పూర్తయితే కానీ దోషులెవరో తేలే అవకాశం లేదు.
స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదం
విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో ఏలూరు రోడ్డులో ఉన్న స్వర్ణ ప్యాలెస్ హోటల్ను కరోనా రోగులకు చికిత్స అందించేందుకు రమేష్ ఆస్పత్రి లీజుకు తీసుకుంది. ఆగస్టు 9న తెల్లవారు జామున ఐదు గంటల సమయంలో ఒక్కసారిగా ఈ హోటల్లో అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. దీంతో తెల్లవారే సరికి విజయవాడ నగరంతో పాటు రాష్ట్రం కూడా నిర్ఘాంతపోయింది. చూస్తుండగానే పది మంది కరోనా రోగులు కాలి బూడిదయ్యారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ఈ హోటల్ను లీజుకు తీసుకున్న రమేష్ ఆస్పత్రిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం తరఫున ముందుగా అక్కడికి వెళ్లిన మంత్రులు చేసిన బాధ్యాతారహిత ప్రకటనలు పరిస్ధితిని మరింత దిగజార్చాయి.
ప్రమాదానికి కారణాల శోధన
స్వర్ణప్యాలెస్ ఘటనలో భారీగా అగ్నికీలలు ఎగసిపడి పది మంది రోగులు సజీవదహనం కావడానికి దారి తీసిన కారణాలపై అప్పటి నుంచి ఇప్పటివరకూ భిన్న వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. షార్ట్ సర్కూటే కారణమని కొందరు, భారీగా నిల్వచేసిన శానిటైజరే కారణమని మరికొందరు, మండే ఇతర పదార్దాల వల్లే ఇది జరిగిందని ఇంకొందరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేశారు. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రెండు అధికారుల కమిటీలు ప్రమాదంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాయి. వీటి ఆధారంగా రమేష్ ఆస్పత్రి యజమాని డాక్టర్ రమేష్ బాబును అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా.. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. చివరికి హైకోర్టు, సుప్రీంకోర్టు జోక్యంతో ఆయన పోలీసుల విచారణకు హాజరయ్యారు.
టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయ దుమారం
ఏపీలో కొన్నేళ్లుగా కుల రాజకీయాలు నడుస్తున్నాయి. వాటి ప్రభావం సహజంగానే ఈ ప్రమాదంపైనా పడింది. సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అందులో ఎవరి బాధ్యత ఎంత అనే చర్చ సాగుతుంది. కానీ స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదం తర్వాత మాత్రం ఇది విపక్ష నేత చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ రమేష్బాబు నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్ కాబట్టి ఆయన స్పందించడం లేదని వైసీపీ ఆరోపణలు మొదలుపెడితే, టీడీపీ కూడా గతంలో ఘటనలను పోలుస్తూ దీనికి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. దీంతో ఇరు పార్టీల మధ్య కొంతకాలం మాటల యుద్ధం సాగింది. దీనిపై ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత వచ్చింది.