అవును.. ఆ ముగ్గురూ కలుసుకున్నారు.. ఏపి కి కాపు కాసినట్టేనా.. చిరంజీవి మర్మం, మతలబు ఏంటి ?
అమరావతి/హైదరాబాద్ : ఏపీ రాజకీయాలు ఎప్పుడూ ఏదో సంచలనంతో ముందుకెళ్తుంటాయి. ఊహకు అందని విషయాలు, అనుకోని మలుపులు ఏపి రాజకీయాల్లో జరిగిపోతుంటాయి. జనసేన పార్టీలో ఇప్పుడు ఇలాంటి సందర్బమే చోటుచేసుకుంది. ఏపి రాజకీయ వేదికపై మెగాస్టార్ చిరంజీవి మెరుపులా వచ్చి ఉరుములా మెరిసారు. కాంగ్రెస్ నేత, మెగాస్టార్ చిరంజీవిని జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ తన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు కలిశారు.
ఈ విషయాన్ని స్వయంగా నాదెండ్ల మనోహర్ తన ట్విట్టరులో షేర్ చేస్తూ... ఈరోజు సైరా నరసింహారెడ్డిని కలిశాను అంటూ కామెంట్ చేశారు. రాజకీయంతో పాటు అనేక అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లు నాదెండ్ల తెలిపారు. అయితే, ఈరోజు చిరంజీవి వ్యక్తిగత జీవితం గురించి తెలిసిన కొన్ని విషయాలు తనలో ఎంతో స్ఫూర్తిని నింపాయని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ముగ్గురు కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. చిరంజీవికి మరిన్ని విజయాలని దక్కాలని మనోహర్ అభిలషించారు.
అయితే... ఇప్పటికిపుడు చిరంజీవిని ఇలా సరదాగా కలవాల్సిన సందర్భం ఏదీ లేదు. మరి చిరంజీవిని కలిశారు అంటే... దీని వెనుక రాజకీయ కారణం కచ్చితంగా ఉండే ఉంటుంది. ఏపీలో టీడీపీ చాలా బలహీనపడిందని, ఇపుడు మనమంతా కలిసి గట్టిగా పోరాడితే రాజకీయంగా లాభదాయకంగా ఉంటుందనే చర్చ జరిగిందని కొందరు చెబుతున్నారు.
ఇటీవలే ముద్రగడ తమ పార్టీలో ఉండగా అంటూ జనసేనను ఓన్ చేసుకున్నారు. కాపులు కూడా 2024 లో జనసేన వైపు నిలుస్తారన్న ప్రచారం కూడా జనసేన నేతలు, ముఖ్యంగా నాగబాబు మొన్నామద్య చెప్పుకొచ్చారు. వీటన్నింటి నేపథ్యంలో అన్నయ్య అండను జనసేన గట్టిగానే కోరుకుంటోందని ప్రచారం జరుగుతోంది. పైగా ఫలితాల అనంతరం జనసేన కంటే పీఆర్పీనే జనం ఎక్కువ నమ్మినట్లు అర్థమైన నేపథ్యంలో చిరంజీవి అండ పార్టీకి ఉపయోగకరం అని పవన్ భావించినట్లు తెలుస్తోంది. మరి భవిష్యత్ రాజకీయాల్లో వీరి కలయిక ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.