మరోసారి పిలిచింది హత్య చేసేందుకా..? పిన్నెల్లి కాల్ డేటా తీస్తే వెలుగులోకి కుట్రకోణం: బోండా ఉమా
మాచర్ల దాడి చేసిన వారిని వదిలేసి.. తమను వేధించడం ఏంటి అని బోండా ఉమా మహేశ్వరరావు పోలీసులను ప్రశ్నించారు. విచారణ పేరుతో ఘటనా జరిగిన స్థలం మాచర్లకు రావాలని కోరడం సరికాదన్నారు. 10 నిమిషాల్లో మాచర్ల చేరుకుంటామనే లోగా కర్రలతో దాడి చేసి బీభత్సం సృష్టించారని ఆనాటి ఘటనను గుర్తుచేశారు. మరోసారి పిలిచి హత్య చేయిస్తారా అని ఆయన ప్రశ్నించారు. మాచర్లలో తమకు తగిన భద్రత లేనందున విచారణకు వెళ్లలేదని మంగళవారం మీడియాతో చెప్పారు.
పిన్నెల్లి కాల్ డేటా..?
దాడి చేసిన తమ కాల్ లిస్ట్ ఎంక్వైరీ చేయడం ఏంటీ అని బోండా ఉమ అడిగారు. దాడిచేసిన వారిని ప్రశ్నించరా అని పోలీసులను నిలదీశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కాల్ డేటా తీస్తే దాడి కుట్ర బయటపడుతోందని చెప్పారు. మాచర్ల ఘటనపై హైకోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేస్తామని వివరించారు. పోలీసులు కాక సీబీఐతో విచారణ జరిగితే దాడి ఘటనపై నిజ నిజాలు వెలుగుచూసే అవకాశం ఉందన్నారు.
పిలిచి హత్య చేస్తారెమో..?
మాచర్ల ఘటనపై విచారణ పేరుతో హత్య చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని బోండా ఉమా ఆరోపించారు. జగన్కు అనుకూలంగా పనిచేసిన అధికారులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని.. ఇదివరకు తిరిగిన అధికారుల గురించి వివరించారు. మాచర్ల, ఇతర ఘటనలతోపాటు కరోనా వైరస్ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎలక్షన్స్ వాయిదా వేసే రచ్చ చేస్తున్నారని పేర్కొన్నారు. మీరు చేయాల్సిన పనిని ఎన్నికల సంఘం నిర్వహిస్తే.. అభినందించాల్సి పోయి.. విమర్శించడం సరికాదని అభిప్రాయపడ్డారు. సామాజిక వర్గం పేరుతో విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు.
Recommended Video
కనిపిస్తే బతికి ఉన్నట్టు..?
వ్యవస్థలను కాపాడేది హైకోర్టు అని.. న్యాయం కోసం ఆశ్రయిస్తామని బోండా ఉమా చెప్పారు. తమకు హైకోర్టులో న్యాయం జరుగుతోందని చెప్పారు. మాచర్ల ఘటన పేరుతో పోలీసులు వేధిస్తున్నారని.. ఏ నిమిషం తాము మీడియా ముందుకొచ్చి కనిపిస్తే బతికి ఉన్నట్టు... లేదంటే చనిపోయినట్టు అని పేర్కొన్నారు. తమ భద్రత గురించి కూడా హైకోర్టులో పిటిషన్ వేస్తామని బోండా ఉమా చెప్పారు.