రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వైఎస్ భారతి చిరు కానుక..!!
విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం వరకు తీరికలేని షెడ్యూల్లో గడిపారు. విశాఖపట్నంలో నౌకాదళ దినోత్సవాల్లో పాల్గొనడానికి విజయవాడకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ ఉదయం న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ద్రౌపది ముర్మును గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డితో కలిసి స్వాగతం పలికారు.
ద్రౌపది ముర్ము గౌరవార్థం పెనమలూరు మండలం పోరంకిలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన పౌర సన్మానం కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రపతిని వైఎస్ జగన్ ఘనంగా సత్కరించారు. ద్రౌపది ముర్ము గొప్పదనాన్ని వివరించారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ గిరిజన మహిళ అత్యున్నత పదవిని అధిరోహించారని పేర్కొన్నారు. సామాజికవేత్తగా, ప్రజాస్వామ్యవాదిగా, అణగారిన వర్గాల కోసం అచంచలమైన కృషి చేశారని కొనియాడారు. అన్నింటికంటే మించి ఒక గొప్ప మహిళగా ద్రౌపతి ముర్ము జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు.
ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రపతిగా ఎన్నికైన వీవీ గిరి, నీలం సంజీవరెడ్డి పేర్లను ప్రస్తావించారు. వారిద్దరూ ఏపీ నుంచి రాష్ట్రపతి బాధ్యతలు నిర్వర్తించారని గుర్తు చేశారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, గురజాడ అప్పారావు ఆచార్య నాగార్జునుడులను స్మరించుకున్నారు. దేశాభివృద్ధిలో ఏపీ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యలను గుర్తు చేసుకున్నారు.
అనంతరం రాజ్భవన్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇచ్చిన విందుకు హాజరయ్యారు. ద్రౌపది ముర్ము, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జీ కిషన్ రెడ్డిలతో కలిసి విందులో పాల్గొన్నారు వైఎస్ జగన్. ఈ సందర్భంగా ఆయన భార్య వైఎస్ భారతి రాష్ట్రపతిని మర్యాదపూరకంగా కలిశారు. పోరంకిలో సన్మాన కార్యక్రమాన్ని ముగించుకుని రాజ్భవన్కు చేరుకున్న కొద్దిసేపటి తరువాత వైఎస్ భారతి అక్కడికి వచ్చారు. ద్రౌపది ముర్మును కలిసి జ్ఞాపికను అందజేశారు. పట్టు చీరెను ఇచ్చారు.