కన్నా తీరుపై వైసీపీ గరంగరం... ఆ 18 ఎకరాల భూకబ్జా బయటపెడతాం- ఏపీ సర్కార్ హెచ్చరికలు...
టీటీడీ భూముల విక్రయం వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. జగన్ సర్కారును టార్గెట్ చేసుకుని పదేపదే విమర్శలు చేస్తున్న కన్నాపై తీవ్ర ఆరోపణలు చేశారు. కబ్జాదారైన కన్నా ప్రభుత్వంపై అనవసరంగా నోరు పారేసుకుంటే సహించబోమన్నారు.
టీటీడీ భూముల వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ సర్కారును టార్గెట్ చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు ఫైర్ అయ్యారు. టీటీడీ భూముల విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ కన్నా దీక్ష చేపట్టడాన్ని వీరు తీవ్రంగా తప్పుబట్టారు. కన్నా ఎందుకు దీక్ష చేస్తున్నారో చెప్పాలని, గత పాలక మండలి నిర్ణయం రద్దు చేసినందుకు మీరు దీక్ష చేస్తున్నారా అని మంత్రి వెల్లంపల్లి ప్రశ్నించారు. టీటీడీ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నూజివీడు వెంకటాచలం భూములు 18 ఎకరాలు కబ్జా గురించి అతి త్వరలో వివరాలు బయటపెడతామన్నారు.
ప్రభుత్వం హిందూ మత వ్యతిరేకి అంటూ కన్నా చేస్తున్న విమర్శలపై బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు కూడా తీవ్రంగా స్పందించారు. నూజివీడులో కన్నా కబ్జాకోరు భాగోతం త్వరలోనే బయటపెడతామన్నారు. లాక్ డౌన్ లో మతపరమైన కార్యక్రమాలు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్న అర్చకులు, పాస్టర్లు, ఇమామ్ లకు ఐదేసి వేల చొప్పున ప్రభుత్వం సాయం చేస్తుంటే కన్నా మాత్రం ఏసీల్లో కూర్చుని దీక్షలు చేస్తూ ప్రభుత్వం హిందూ వ్యతిరేకి అంటూ విమర్శలు చేస్తున్నారని విష్ణు ఆరోపించారు. టీటీడీ వ్యవహారంపై అప్పటి మీ దేవాదాయ మంత్రి మాణిక్యాలరావును ప్రశ్నించాలని కన్నాకు మల్లాది సవాల్ విసిరారు.