బందరు పోర్టును తెలంగాణకు ఇచ్చేస్తున్న జగన్..!లాలూచీ రాజకీయాలంటూ బాబు మండిపాటు..!!
అమరావతి/హైదరాబాద్ : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు ఏపి టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రదబాబు నాయుడు. వైసీపీ ప్రభుత్వం బందరు పోర్టును తెలంగాణకు అప్పగించే ప్రయత్నం చేస్తోందని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. జూన్ 28న ఆర్టీ-62 నంబర్తో రహస్య జీవోగా జారీ చేసి, రెండు రోజుల్లో 'జారీ చేయబడలేదు' అని మార్చారని చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణకు బందరు పోర్టు ఇస్తున్నారా అని అసెంబ్లీలో ప్రశ్నిస్తే..
అలాంటిదేమీ లేదని బుకాయించారని చంద్రబాబు పేర్కొన్నారు. కానీ పోర్టును తెలంగాణకు అప్పగించేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సీమాంధ్రకు పోర్టులు ప్రకృతి ఇచ్చిన వరమని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇలాంటి పోర్టులపై సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికీ లేదన్నారు. మీ స్నేహాలకు, సొంత లాలూచీలకు.. రాష్ట్ర ఆస్తులను ధారాదత్తం చేస్తామంటే సహించేది లేదని ట్విట్టర్లో చంద్రబాబు పేర్కొన్నారు.
Recommended Video
ఇదిలా ఉండగా మాజీ మంత్రి లోకేష్ కూడా ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మండి పడ్డారు. ఏపి పరిపాలన తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు కనుసన్నల్లో నడుస్తోందనడానికి తాజా పరిణామాలే కారణమని ఆయన చెప్పుకొచ్చారు. పరస్తర అవగాహనతో తెలంగాణ సీఎం, ఏపి సీఎంలు పని చేస్తున్నారని మండిపడ్డారు. బందరు పోర్టును తెలంగాణకు ఇస్తామంటున్నారని..
రేపు పాలన కూడా చేతకాదని కేసీఆర్కు అప్పగిస్తారా? అంటూ ట్విట్టర్ వేదికగా టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. 'బందరు పోర్టును తెలంగాణకు అప్పగిస్తామంటున్నారు. రేపు పాలన కూడా చేతకావడం లేదని కేసీఆర్కు అప్పగిస్తారా? ఇలాంటి అసమర్ధులు ఒక్క చాన్స్ అంటూ ఎందుకు అడిగారు? ప్రజల భవిష్యత్ను పక్క రాష్ట్రాలకు తాకట్టుపెట్టడానికా'? అంటూ లోకేష్ మండిపడ్డారు.