ఏపీ ఫైబర్ నెట్ అక్రమాలపై ఫుల్ ఫోకస్: ఛైర్మన్గా వైసీపీ కీలక నేత నియామకం
అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నట్టుగా అనుమానిస్తోన్న ఏపీ ఫైబర్నెట్ లిమిటెడ్ అక్రమాలపై డొంక కదిలే పరిస్థితి నెలకొంది. ఈ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ జగన్ సర్కార్ ఇదివరకే మంత్రివర్గంలో తీర్మానించింది. ఆ తరువాత ఈ దిశగా పెద్దగా ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించలేదు. తాజాగా మరో కీలక అడుగు ముందుకు పడిందని అంటున్నారు. ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్గా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి నియమితులు అయ్యారు.
ఈ మేరకు మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవేన్ కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడకు చెందిన గౌతమ్ రెడ్డి వైఎస్సార్సీపీ అనుబంధ కార్మిక సంఘానికి అధ్యక్షుడిగా పని చేశారు. 2014 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఆయనకు టికెట్ లభించలేదు. గౌతమ్ రెడ్డి స్థానంలో మల్లాది విష్ణుకు టికెట్ ఇచ్చింది పార్టీ అగ్ర నాయకత్వం. అనంతరం ఆయన వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
తాజాగా ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్గా నియమితులు అయ్యారు. ఈ సంస్థలో భారీగా అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నట్లుగా జగన్ సర్కార్ అనుమానిస్తోంది. దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ ఇదివరకే కేబినెట్లో నిర్ణయాన్ని తీసుకుంది. మొత్తం 850 కోట్ల రూపాయల మేర చేతులు మారాయనే ఆరోపణలు ఈ సంస్థపై ఉన్నాయి. అదే సమయంలో- అధికార పార్టీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్కు చెందిన పేస్ పవర్ సిస్టమ్స్ ప్రైవేటు లిమిటెడ్ ఫిర్యాదు చేసింది. తాజాగా గౌతమ్ రెడ్డి నియామకం కావడం.. ఇందులో కదలిక నెలకొన్నట్లుగా భావిస్తున్నారు.