పదవి పోతుందని తెలిసినా జగన్ విశాఖ వెళ్లారా ? పీవీపీ ట్వీట్ సంచలనం- గతంలో ఎన్టీఆర్ కు ఏమైంది ?
రాజకీయాల్లో సెంటిమెంట్లకు ఉన్న విలువ అంతా ఇంతా కాదు. ప్రతీ రాజకీయ నేతా ప్రతీ విషయంలో సెంటిమెంట్లకు ప్రాధాన్యం ఇస్తుంటారు. తమ విజయాలకు ఈ సెంటిమెంట్లే కారణమని భావించే వారే ఎక్కువగా ఉంటారు. కానీ కొన్నిసార్లు ఇలాంటి సెంటిమెంట్లను పట్టించుకోకుండా ముందుకెళ్లి విజయం సాధించిన వారు, దెబ్బతిన్న వారూ లేకపోలేదు. తాజాగా గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించేందుకు జగన్ విశాఖ టూర్ కు వెళ్లడంపై ఇలాంటి సెంటిమెంట్ ఒకటి ఉందని వైసీపీ నేత పీవీపీ చేసిన ట్వీట్ ఇప్పుడు కలకలం రేపుతోంది.
తెలుగు మహిళా సీఎంను చూడాలనుంది.. పీవీపీ ట్వీట్: ఆసక్తికర చర్చ
జగన్ విశాఖ టూర్- పీవీపీ ట్వీట్..
విశాఖలో గ్యాస్ లీకేజీ బాధితుల పరామర్శ కోసం సీఎం జగన్ కింగ్ జార్జ్ ఆస్పత్రికి వెళ్లారు. మామూలుగా చూస్తే ఇదేమంత పెద్ద విషయం కాదు. కానీ రాజకీయాల్లో సెంటిమెంట్ లను దృష్టిలో ఉంచుకుని చూస్తే మాత్రం జగన్ చాలా ధైర్యం చేసి వెళ్లారని చెప్పక తప్పదు. ఇదే విషయాన్ని వైసీపీ నేత, సినీ నిర్మాత పీవీపీ ఇవాళ ట్వీట్ చేశారు. విశాఖ కేజీహెచ్ కు వెళ్లడం ద్వారా పాతికేళ్ల తర్వాత ఓ సీఎంగా జగన్ చాలా ధైర్యం చేశారని ప్రశంసించిన పీవీపీ, ప్రజాసంక్షేమం ముఖ్యం కానీ పదవి కాదని స్పష్టం చేశారు. ఇప్పుడు ఆయన ట్వీట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
ఎన్టీఆర్ తో జగన్ ను పోల్చిన పీవీపీ...
1995లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విశాఖ కేజీహెచ్ ఆస్పత్రి సందర్శించాకే పదవి కోల్పోయారని, పాతికేళ్ల తర్వాత సీఎం హోదాలో ఉన్న జగన్ చాలా ధైర్యం చేసి కేజీహెచ్ సందర్శించారని, ఇందులో ఎలాంటి సెంటిమెంట్లను పట్టించుకోలేదని పీవీపీ తన ట్వీట్ లో ప్రశంసల జల్లు కురిపించారు. పీవీపీ ట్వీట్ తర్వాత ఇప్పుడు జగన్ అభిమానులంతా ఎన్టీఆర్ తో ఆయన్ను పోల్చి చూస్తున్నారు.
అప్పట్లో ఎన్టీఆర్ విషయంలో ఏం జరిగింది ?
1994లో ఎన్టీఆర్ మూడోసారి సీఎంగా అధికారం చేపట్టిన ఎన్టీఆర్.. 1995లో ఉత్తరాంధ్రలో పజలను కలుసుకునేందుకు శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రజా యాత్ర చేపట్టారు. అప్పట్లో సతీమణి లక్ష్మీపార్వతితో కలిసి ఉత్తరాంధ్రలో యాత్ర ప్రారంభించిన ఎన్టీఆర్ విశాఖ వచ్చేసరికి కింగ్ జార్జ్ ఆస్పత్రిలో రోగులను కలుసుకునేందుకు వెళ్లారు. ఆ తర్వాత టీడీపీలో వేగంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవడం, ఎన్టీఆర్ వెంటనే హైదరాబాద్ తిరిగి వచ్చేయడం, వైశ్రాయ్ హోటల్ ఘటన, ఎన్టీఆర్ అధికారం కోల్పోవడం, ఆ తర్వాత ఆయన మరణం చకచకా జరిగిపోయాయి. దీంతో కేజీహెచ్ ఆస్పత్రి సందర్శించడం వల్లే ఆయన పదవి కోల్పోయారనే సెంటిమెంట్ బయలుదేరింది.
Recommended Video
సెంటిమెంట్లు పట్టించుకోని జగన్...
ఎన్టీఆర్ తో పోలిస్తే జగన్ ఎప్పుడూ సెంటిమెంట్లపై ఆధారపడలేదు. స్వయం కృషితోనే జీవితంలో ఎన్నో విజయాలు సాధించారు. బిజినెస్ లో అయినా, రాజకీయాల్లో అయినా జగన్ సెంటిమెంట్ కంటే స్వయంకృషినే నమ్ముకున్నారు. అందుకే కొండలాంటి సోనియాగాంధీని, కాంగ్రెస్ పార్టీని, అందులో ప్రత్యర్ధులను ఎదిరించి మరీ సొంత రాజకీయానికి తెరలేపారు. చివరికి పదేళ్ల కష్టంతోనే ప్రజల మనసులను గెలిచి అనితర సాధ్యమైన మెజారిటీతో అధికార పగ్గాలు చేప్టటారు. అదే విషయాన్ని వైసీపీ నేత పీవీవీ తన ట్వీట్లో పరోక్షంగా ప్రస్తావించారు. అయితే పదవిని కూడా లెక్కచేయకుండా ప్రజాసంక్షేమం కోసమే జగన్ కేజీహెచ్ కు వెళ్లారని పీవీపీ ట్వీట్ లో పేర్కొన్నారు.