ఏపిలో 35 లక్షల నకిలీ ఓట్లు : ఏపి-తెలంగాణలో రెండు చోట్లా 18 లక్షల మందికి ఓట్లు..
తెలంగాణ ఎన్నికల సమయంలో ఓట్లు తొలిగించారనే ఫిర్యాదులు లెక్కకు మించి వచ్చాయి. ఇప్పుడు ఏపిలో ఓట్ల పై గందరగోళం కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం ఏపిలో 24 లక్షలకు పైగా అనుమానిత ఓట్లు ఉన్నాయని ..విచారణ జరుపుతున్న ఏపి ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించారు. అయితే, వీటితో ఏపిలోని రాజకీయ పార్టీలు విభేదిస్తున్నాయి. ఏపిలో 35 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని..అదే సమయంలో ఏపి -తెలంగాణ లో రెండు చోట్లా ఓటు ఉన్న వారి సంఖ్య 18 లక్షలకు పైగా ఉందని నేరుగా ఎన్నికల ప్రధానాధికారికి వైసిపి నేతలు ఫిర్యాదు చేసారు.
ఏపిలో కొనసాగుతున్న ఓట్ల గందరగోళం పై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాతో వైఎస్సార్సీపీ అగ్రనేతలు భేటీ అయ్యారు. ఏపీలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సర్వేల పేరుతో టీడీపీ కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్లి వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని కమిషనర్కు వివరించారు. ఓట్లు తొలగించబడిన ప్రతి ఒక్కరికీ ఓటు కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితాలో ఉన్న అన్ని తప్పులను క్షుణ్ణంగా పరిశీలించి సరిదిద్దాలని వినతి పత్రం సమర్పించారు.
ఏపిలో నకిలీ ఓట్లు..ఓట్ల తొలిగింపు వ్యవహారం పై వైసిపి తో పాటుగా జనసేన సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అధికార పార్టీ సర్వేల పేరుతో తమకు వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను తొలిగించే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపిస్తున్నారు. దీని పై ఎన్నికల ప్రధానాధికారి కి సైతం ఫిర్యాదు చేసారు. వైసిపి ఇప్పటికే దీని పై కోర్టును ఆశ్రయించింది. ఇక, ఈ వ్యవహారం ఇప్పుడు నేరుగా కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి వెళ్లటంతో ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి..