వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ముగ్గురే ప్రమాణం: అంబానీ ఫ్రెండ్ మిస్: ఇంటరెస్టింగ్ సీన్
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం పార్లమెంట్ హౌస్లో నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా వారు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ ఎం వెంకయ్య నాయుడు వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నికైన పలువురు సీనియర్, జూనియర్ నేతలు ప్రమాణ స్వీకారం చేశారు.
స్పీకర్ సంచలన నిర్ణయం: హైకోర్టు ఆదేశాలపై సుప్రీంలో సవాల్: చట్టసభా హక్కులను ప్రశ్నిస్తారా?
వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్యా రామిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అయోధ్య రామిరెడ్డి హిందీలో, మిగిలిన ఇద్దరూ తెలుగులో ప్రమాణం చేశారు. వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సన్నిహితుడు పరిమళ్ నత్వానీ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. వ్యక్తిగత కారణాల వల్ల ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు. పార్లమెంట్ తరువాతి సమావేశాల సందర్భంగా తాను ప్రమాణ స్వీకారం చేస్తానంటూ ఛైర్మన్కు లేఖ పంపించారు.
కిందటి నెల 19వ తేదీన నిర్వహించిన రాజ్యసభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నలుగురూ ఎన్నికయ్యారు. రాష్ట్రం నుంచి నాలుగు స్థానాలు ఖాళీ ఏర్పడగా.. అయిదుమంది పోటీ చేశారు. దీనితో పోలింగ్ను నిర్వహించాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీ తరఫున వర్ల రామయ్య అయిదో అభ్యర్థిగా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఓడిపోయారు. ఆయనకు 17 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. తెలుగుదేశం పార్టీకి ఉన్న శాసనసభ్యుల బలంతో పోల్చుకుంటే.. ఈ సంఖ్య తక్కువే కావడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 61 మంది వేర్వేరు పార్టీలకు చెందిన నేతలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. వారిలో 45 మందే ప్రమాణం చేశారు. కాంగ్రెస్కు గుడ్బై చెప్పి భారతీయ జనతా పార్టీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా, కాంగ్రెస్ సీనియర్ నేతలు, కేంద్ర మాజీమంత్రులు దిగ్విజయ్ సింగ్, మల్లికార్జున ఖర్గె, గులాంనబీ ఆజాద్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
Recommended Video
ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు- దిగ్విజయ్ సింగ్ నేరుగా జ్యోతిరాదిత్య సింధియా వద్దకు వెళ్లి నమస్కారం చేశారు. ఎలా ఉన్నావు? అంటూ పలకరించారు. దీనికి బదులుగా జ్యోతిరాదిత్య.. తాను బాగున్నానని సమాధానం ఇచ్చారు. దిగ్విజయ్ సింగ్, జ్యోతిరాదిత్య.. ఇద్దరూ మధ్యప్రదేశ్కు చెందిన నేతలే. జ్యోతిరాదిత్య సింధియా.. కాంగ్రెస్కు గుడ్బై చెప్పడం, తన వర్గానికి చెందిన శాసనసభ్యులతో బీజేపీలో చేరడం వల్లే.. మధ్యప్రదేశ్లో అధికారంలో ఉన్న కమల్నాథ్ ప్రభుత్వం కుప్పకూలింది. కాంగ్రెస్ స్థానంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.