కృష్ణానదికి వరదలు రావనే ధైర్యం..రివర్ వ్యూ పేరుతో నదీ గర్భంలో కొత్త భవన నిర్మాణం: ఎమ్మెల్యే ఆర్కే
గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి బుధవారం ఉదయం పరిశీలించారు. కృష్ణా నదికి సంభవించిన వరద ప్రవాహం చంద్రబాబు ఇంటిని చుట్టుముట్టిన నేపథ్యంలో- ఆయన ఇంటి సంరక్షణ చర్యలను పర్యవేక్షించారు. వరదనీరు భవనంలోనికి రాకుండా ఉండటానికి వందలాది ఇసుక బస్తాలు, స్టోన్ క్రష్ మూటెలను అడ్డుగా పెట్టారు అక్కడి సిబ్బంది. ఆయా పనులన్నింటినీ ఆళ్ల.. తిలకించారు. సాధ్యమైనంత వరకు వరద నీరు భవనం లోనికి రాకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన అక్కడి సిబ్బందిని సూచించారు. ఈ సందర్భంగా ఆళ్ల రామకృష్ణా రెడ్డి కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు.
నదీ గర్భంలో ఇంటిని కట్టుకుంటే..ఎలా?
కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాన్ని అధిగమించి.. నదీ గర్భంలో ఇంటిని నిర్మించుకున్నారని విమర్శించారు. ఇంతకుముందు- లింగమనేని అతిథిగృహానికి అదనంగా రివర్ వ్యూ పేరుతో మరో భవనాన్ని నిర్మించారనే విషయం తాజాగా వెలుగు చూసిందని ఆళ్ల తెలిపారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు.. లింగమనేని అతిథిగృహంలో చేరిన తరువాత ఆ భవనాన్ని నిర్మించారనే విషయం ఇప్పుడే తెలిసిందని అన్నారు. రివర్ వ్యూ పేరుతో భవనం కట్టిన విషయం తమకు తెలియదని చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కరకట్ట రోడ్డుకు కూడా రానివ్వలేదని అన్నారు. ఏం జరుగుతున్నదో తెలిసే అవకాశమే లేకుండా పోయిందని అన్నారు. తీరా ఇప్పుడు చూస్తే.. కరకట్ట నివాసానికి వెనుక వైపు అదనంగా మరో భవనాన్ని నిర్మించుకున్నారని అన్నారు. ఆ భవనం నీట్లో మునిగిందని చెప్పారు.
అత్తి వరదార్ సేవలో తలైవా: ఇక ఆయన దర్శనం 2059లోనే..అప్పటిదాకా కోనేట్లోనే
వరద రాదనే భయంతోనే..
కృష్ణా నదికి వరదలు రావనే ధైర్యంతోనే చంద్రబాబు ఈ సాహసం చేశారని ఆరోపించారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా.. వరదలు రావనే నమ్మకమే ఆయనను ఈ భవన నిర్మాణానికి పురిగొల్పి ఉంటుందని ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు నివాసం ప్రైవేటు భవనం కాదని, అది ప్రభుత్వ ఆస్తి అని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత చెప్పారు. చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబీకులు క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతోనే తాము కరకట్ట నివాసాన్ని ఖాళీ చేయాలని సూచించినట్లు చెప్పారు. రాజకీయ కారణాలు, రాజకీయ కక్షలు తమకు లేవని ఆయన స్పష్టం చేశారు. 2009లో కూడా కృష్ణానదికి ఇదే తరహాలో భారీ వరద ప్రవాహం చోటు చేసుకుందని, అప్పట్లో ఉండవల్లి గ్రామంలో అడుగులోతు వరద నీరు ప్రవహించిందని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితి తలెత్తుతుందని తెలిసి కూడా చంద్రబాబు అక్రమ కట్టడంలో నివాసం ఉన్నారని చెప్పారు. ఆయన మనస్సాక్షికి ఇదంతా తెలుసని చెప్పుకొచ్చారు.
నీట మునిగిన రివర్ వ్యూ..
ఇదిలావుండగా.. కరకట్ట నివాసం వెనుక అదనంగా నిర్మించిన భవనం ఆవరణలోకి వరదనీరు ప్రవేశించింది. తన వ్యాయామంలో భాగంగా చంద్రబాబు చేసే వాకింగ్ ట్రాక్ రివర్ వ్యూ ఆవరణలోనే ఉంది. ప్రస్తుతం ఆ వాకింగ్ ట్రాక్ మొత్తం నీట్లో మునిగిపోయింది. వరద నీరు మరింత చొచ్చుకుని రాకుండా ఉండటానికి అక్కడి సిబ్బంది పెద్ద ఎత్తున రక్షణ చర్యలు చేపట్టారు. ఇసుక బస్తాలు, స్టోన్ క్రష్ మూటెలను అడ్డుగా ఉంచారు. అయినప్పటికీ- వరద ప్రవాహానికి అడ్డుకట్ట పడలేదు. నీరు చొచ్చుకుని వచ్చి.. రివర్ వ్యూ భవనం ఆవరణలోకి ప్రవేశించింది. ఈ పరిస్థితిని ముందుగానే గ్రహించిన చంద్రబాబు నాయుడు.. విశ్రాంతి పేరుతో హైదరాబాద్ కు వెళ్లిపోయారని ఆయన రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు.